రామాయంపేట, జనవరి 8 : జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛ పురస్కారాలను ఈ నెల 10వ తేదీన అందజేయనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లావ్యాప్తంగా 8 మండలాల్లో స్వచ్ఛ పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తూప్రాన్ పట్టణం లోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ బాలికల పాఠశాల, చిన్నశంకరంపేటలోని అభ్యాసన గ్లోబల్ హైస్కూల్, రామాయంపేట మండలం సుతారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, నర్సాపూర్ మండలం మాసాయిపేట ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాల, మెదక్లోని డాన్బాస్కో, సరస్వతీ శిశుమందిర్, గీతా హై స్కూల్, మనోహరాబాద్ మండలంలోని జాయిన్ ఇంటర్నేషనల్ పాఠశాల స్వచ్ఛ పురస్కారా లకు ఎంపికైనట్లు తెలిపారు. 10న మెదక్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ పురస్కారాల సర్టిఫికెట్లను హెచ్ఎంలకు అందజేయనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు. ప్రతి పాఠశాలలో స్వచ్ఛతో పాటు పచ్చదనం పెంపొందించాలని సూచించారు.
ఉమ్మడి మండలం నుంచి పాఠశాలల ఎంపిక
వెల్దుర్తి, మాసాయిపేట మండలాల నుంచి ఒక్కో పాఠశాల స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపికైనట్లు ఎంఈవో యాదగిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్దుర్తి మండలంలోని యశ్వంతరావుపేట ప్రాథమికోన్నత పాఠశాల, మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలు స్వచ్ఛ పాఠశాలలుగా ఎంపికయ్యాయన్నారు. పాఠశాలల్లో కొవిడ్-19జాగ్రత్తలు, పరిశుభ్రత ఆధారంగా వెల్దుర్తి, మాసాయిపేట మండలాల నుంచి పాఠశాలలు పురస్కారాలకు ఎంపికయ్యాయని తెలిపారు.