కందుకూరు : ఎన్నికల సమయంలోనే కనిపించే ప్రతిపక్షాలకు మరోసారి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy ) అన్నారు. మేడ్చల్లో చెల్లని రూపాయి మహేశ్వరంలో చెల్లుతుందా అంటూ ప్రత్యర్థులను విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మాదాపూరు, కొలనుగూడ. గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాన్పేట్, బేగరికంచె, అన్నోజిగూడ, కటికపల్లి, గూడూరు గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. ప్రజల సమస్యలు పట్టించుకోని , కరోనాలో కనిపించని నేతలు నేడు మీ ముందుకు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
డబ్బుల సంచులు నెత్తిన పెట్టుకొని మేడ్చల్ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి మహేశ్వరంలో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. గతంలోనూ రెండు సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిన కేఎల్ఆర్ను మూడోసారి కూడా చిత్తుగా ఓడిస్తానని ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులని, తాను రియల్ లీడరునని పేర్నొన్నారు. రియల్ వ్యాపారులు కావాలా, రియల్ లీడరు కావాలా ఆలోచించాలని కోరారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణరెడ్డి, చిలకమర్రి నర్సింహ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.