సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 12 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడ్ప్లస్ కంపనీలో 50 ఫార్మసిస్ట్, వేర్ హౌస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. కనీస వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేలు ఉంటుందని, ఇన్సెంటీవ్స్ లభిస్తాయని వివరించారు.
ఆసక్తి, అర్హత గల యువతీ యువకులు తమ విద్యార్హత ధృవపత్రాల జిరాక్స్ ప్రతులు, అనుభవ ధృవీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు స్థానిక బైపాస్ రోడ్డులోని వెలుగు కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన సూచించారు.
ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.