రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. విద్య,వైద్య, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుండడంతో మానవ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ అమలుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది. సంగారెడ్డి జిల్లాలో 98శాతం ప్రసవాలు దవాఖానల్లోనే జరుగుతున్నాయి. నవజాత శిశువులు, బాలింతల మరణాలు రేటు తగ్గుముఖం పట్టాయి. సర్కారులో 98శాతం పిల్లలకు వ్యాక్సినేషన్ జరుగుతున్నది. మహిళా అక్షరాస్యత శాతం పెరిగింది.గతంతో పోలిస్తే రక్షిత తాగునీటి సరఫరా వందశాతం మెరుగైందని, 99.40 శాతం ఇండ్లకు శుద్ధ్ది జలాలు అందుతున్నాయని, 99.60 శాతం గృహాలకు కరెంటు సరఫరా జరుగుతున్నదని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20)లో ఈ విషయాలను వెల్లడించింది.
సంగారెడ్డి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిసారించి, నిధులు కేటాయించడంతో పాటు అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేసీఆర్ కిట్ అమలుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంగారెడ్డి జిల్లాలో 98శాతం ప్రసవాలు దవాఖానల్లోనే జరుగుతున్నాయి. నవజాత శిశువులు, బాలింతల మరణాలు రేటు జిల్లాలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో 98శాతం పిల్లలకు వ్యాక్సినేషన్ జరుగుతున్నది. మహిళా అక్షరాస్యుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మహిళా అక్షరాస్యత శాతం 63 శాతానికి చేరుకున్నది. జిల్లాలో ప్రజల ఆరోగ్య స్థితిగతులు, గర్భిణులు, శిశువుల ఆరోగ్య పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20)విడుదల చేసింది. సర్వే గణాంకాలను అనుసరించి సంగారెడ్డి జిల్లాలో 93 శాతం ప్రసవాలు దవాఖానల్లో జరుగుతున్నట్లు తేలింది. 95శాతం ప్రసవాలు నిపుణులైన వైద్యసిబ్బంది పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 34.60 శాతం ప్రసవాలు మాత్రమే సిజేరియన్ ద్వారా జరుగుతుండగా, ప్రైవేట్లో 71.60 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. ప్రసవానంతరం తల్లుల సంరక్షణ సంగారెడ్డి జిల్లాలో 82.80 శాతంగా ఉంది. 66.40శాతం మంది తల్లులు కనీసం నాలుగుసార్లు దవాఖానల్లో వైద్యసేవలు పొందుతున్నారు. 44 శాతం మంది గర్భిణులు ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు వాడుతున్నారు. జిల్లాలో 98శాతం మంది గర్భిణులు ప్రభుత్వం అందజేసే మాతా శిశుసంరక్షణ కార్డుల కోసం తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. 12 నుంచి 23 నెలల వరకు పిల్లలకు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 98.10శాతం మంది పిల్లలకు అన్నిరకాల వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు ‘ఆరోగ్యశాఖ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ నివేదిక వెల్లడించింది. వైద్య సిబ్బంది 90శాతం మంది పిల్లలు డీపీటీ వ్యాక్సిన్లు, 89.70 శాతం మంది పిల్లలకు మీజిల్స్ వ్యాక్సిన్, 90శాతం మందికి బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాలో 3శాతం మంది ఐదేండ్ల్లలోపు పిల్లలు అధిక బరువు ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైంది. 29శాతం మంది మహిళల్లో అధిక బరువు సమస్య ఉంది. 15 నుంచి 49 ఏండ్ల వయస్సు మహిళల్లో 48.30 శాతం మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 27.30 శాతం మంది పరుషులు పొగాకు ఉత్పత్తులను వాడుతుండగా, 39.70 శాతం మంది మద్యం సేవిస్తున్నారు.
99.4 శాతం ఇండ్లలో రక్షత మంచినీరు..
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేస్తున్నది. ప్రభుత్వ చర్యలతో గతంతో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలో రక్షిత మంచినీటి సరఫరా వందశాతం మెరుగైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికను అనుసరించి సంగారెడ్డి జిల్లాలో 99.40 శాతం ఇండ్లకు శుద్ధ్దిచేసిన జలాలను సరఫరా చేస్తున్నారు. 99.60 శాతం గృహాలకు కరెంటు సరఫరా అవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో 97.50 శాతం కుటుంబాలు అయోడైజ్డ్ ఉప్పును వాడుతున్నాయి. జిల్లాలోని 58.10 కుటుంబాలు ఆరోగ్యబీమా సౌకర్యాన్ని పొందుతున్నాయి. 62.3 శాతం మంది కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు.