చేగుంట, ఫిబ్రవరి 2: చేగుంట మండలంలోని కర్నాల్పల్లి గ్రామంలో సాయి మందిరం నిర్మించి అప్పుడే పుష్కర కాలం గడిచింది. ఈ నేపథ్యంలో 12వ వార్షికోత్సవానికి ఆలయం ముస్తాబవుతున్నది. చేగుంటకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం 2010లో నిర్మించారు. గ్రామానికి చెందిన అంబటి ఆంజనేయులు హైదరాబాద్లో టైలర్ వృత్తిలో స్థిరపడగా ఒక రోజు సాయినాథుడు స్వప్నంలో దర్శనం ఇచ్చి కర్నాల్పల్లిలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సాయి మందిరం నిర్మించాలని సంకల్పించడంతో ఆలయ నిర్మాణం చేపట్టారని స్థానికులు చెబుతారు.
స్వామివారి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, విజయవాడ దుర్గాప్రసాద్ స్వామి, కాశీనాథ్ బాబా, సమర్థ మహరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. 2011 ఫిబ్రవరిలో జరిగిన వార్షికోత్సవం సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి సంకల్పంతో ఈ సాయి ఆలయంలో ప్రతి గురువారం ప్రత్యేక పూజలు, నిత్యాన్నదానం కొనసాగిస్తున్నారు. ఈ ఏటి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల సందర్భంగా పలు విశేష పూజలకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం నిర్వహించే విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా తొగుట ఆశ్రమ పీఠాధిపతి పూర్ణాహుతి చేస్తారని నిర్వాహకులు తెలిపారు.