వ్యవసాయ రంగంలో ధరణి పోర్టల్ ఓ సాంకేతిక విప్లవం. అన్నదాతకు కొండంత ధీమా. భూ బకాసురుల కోరలు పీకిన ఆయుధం. అవినీతి, అక్రమాలకు చరమగీతం. పక్కాగా పారదర్శకమైన సేవలు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పని తీరు. ధరణి రాకతో రెవెన్యూ శాఖలో మొదలైన నవ శకం విజయవంతంగా కొనసాగుతున్నది. రైతుల భూ సమస్యలు శరవేగంగా పరిష్కారమవుతున్నాయి. గతానికి భిన్నంగా మ్యుటేషన్, పాస్పుస్తకాల జారీ అంతా ఆన్లైన్లోనే పారదర్శకంగా జరుగుతున్నది. కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన బాధలు రైతులకు తప్పాయి. ధరణి పోర్టల్లో భూముల వివరాలు భద్రంగా నిక్షిప్తమవుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సిద్దిపేట, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తరతరాలుగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నీ పటా పంచలైపోతున్నాయి. ఆ పుణ్యం ధరణిదేనంటోంది సామాన్య ప్రజానీకం. భూముల రికార్డులు సేఫ్గా ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తోంది రైతాంగం. తహసీల్దార్కు అధికారం బదలాయింపుతో భూ రిజిస్ట్రేషన్లు సులభతరమయ్యాయని అంటున్నారు. గతంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడ్డ తిప్పలన్నీ తప్పాయని చెబుతున్నారు. నేడు తహసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిమిషాల వ్యవధిలోనే అయిపోతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అన్ని సమస్యలూ స్థానికంగానే పరిష్కారమవుతున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు. భూ సమస్యల పరిష్కారం వేగంగా అయిపోతోందని, ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవలు సత్వరంగా అయిపోతున్నాయని అంటున్నారు. ఈ పోర్టల్ ద్వారా పారదర్శకత పెరిగిందంటూ రాష్ట్ర సర్కారుపై వేనోళ్ల పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ధరణి పోర్టల్ సేవలపై ‘నమస్తే తెలంగాణ’తో పలువురు రైతులు పంచుకున్న అభిప్రాయాల మాలిక వారి మాటల్లోనే…
– నమస్తే తెలంగాణ
న్యూస్ నెట్వర్క్, మే 28
వారంలనే పాసుబుక్కు వస్తంది
ఎవసాయ భూమి చేసుకుంటే వారంలనే పాసుబుక్కు వస్తన్నది. ఐదేండ్ల క్రితం మా బాపు నుంచి ఎకరమునర్న భూమి చేసుకోవడానికి ఇరువై వేలకుపైన కర్సుఅయింది. అక్కడ రెండు వేలు, ఈడ రెండువేలు కర్సు అయ్యేది. పాసుబుక్కు కోసం నెలల తరబడి తిరుగుడు అవుతుండే. ఆఫీసు చుట్టూ తిరిగితే ఇంకా రాలేదు. అని చెప్పుతుండేది. తిరిగితిరిగి కాళ్లరేగిది. ఇప్పుడు ఎవ్వల సుట్టూ తిరుగుడు లేదు. సక్కగ తహసీల్ ఆఫీసుకుపోయి సేసుకుంటే వారంలనే పాసుబక్కు వస్తంది. కేసీఆర్ సార్ పెట్టిందే మంచిగున్నది. టక్కటక్క పని అయితాంది. ఆన్లైన్ల మొన్న మా తమ్మునికి పది గుంటలు చేసిన. పని అయింది. మల్ల పాసుబుక్కు కూడ ఇచ్చిండ్రు. అబ్బో పాత పద్ధతిల పట్టా చేసుకుంటే తిరిగి తిరిగి సచ్చుడే. ఇప్పుడు ధరణిల గిట్ల సేసుడు మంచిగున్నది పాత పద్ధతిల చేసుడు వద్దే వద్దు.
– దొంతరబోయిన సదానందం,
రైతు, హుస్నాబాద్ ధరణి రైతులకు ఎంతో మేలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ధరణి పోర్టల్ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ముందు రైతులు భూములను మార్పిడి చేసుకోలంటే ఎంతో కష్టంగా ఉండేది. విరాసత్, జమాబందీల కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాల్లోనే పని జరగుతున్నది. స్లాట్ బుకింగ్ చేసుకొని కాగితాలతో వెళితే నిముషాల్లో భూమి మార్పిడి జరుగుతున్నది. పాస్ బుక్ కూడా ఇంటికి వస్తున్నది. ఫైరవీలు, లంచాలు లేకుండాపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నిర్ణయం కరెక్టు.
– పేర్యాల మాధవ రావు, రైతు, కోహెడ
నయా పైసా లేకుండా జాగల రిజిస్ట్రేషన్
సీఎం కేసీఆర్ సార్ కొత్తగా తీసుకొచ్చిన ధరణితో మాకు శాస తిప్పలు తప్పింది. శాన రోజుల నుంచి పటెల్ పట్వారీలు ఉండడం వల్లనే ఇష్టం అచ్చినట్లు జాగలు మాయమైనాయి. గిప్పుడైతే నయా పైసా ఖర్చు లేకుండా మండలాఫీసులో జాగలు రిజిస్టేషన్ అయ్యి పట్టా పాస్ పుస్తకంలో జల్ది ఎక్కుతున్నాయి. గప్పుడైతే జాగలు కొన్నా, అమ్మినా ఎంతో తిప్పలు అయ్యేది. పేదోళ్ల కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణితో ఇబ్బందులు లేకుండా భూములు ఎక్కుతున్నయి. రైతుల కోసం తపిస్తున్న సీఎం కేసీఆర్కు రైతులందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – మద్దెల రామస్వామి, రైతు, మిరుదొడ్డి
తిరుగుడు తప్పింది…
భూములు పట్టాకు రావాలంటే ఏళ్లుగా తిరిగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ మంచి ఆలోచనతో ధరణిని తెచ్చిండు. మీ సేవకు పోవుడు.. రిజిస్ట్రేషన్ బుక్ చేసుకునుడు చకచకా అయిపోతాంది. ఒకేరోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుడు సాధ్యమేనా అని అనిపించింది. ఆన్లైన్లో సుత భూమి పేరు మార్పిడి అవుతాంది. అప్పటికప్పుడు డూప్లికేట్ పాస్బుక్ ఇస్తుండ్రు. ఇది నిజంగా గొప్ప విషయం. రైతుల తిప్పలు తప్పినయ్. గతంలో తహసీల్దార్, వీఆర్ఏల చుట్టూ తిరిగేది. ఇప్పుడు గా బాధల్లేవ్.
– కోటగిరి యాదగిరి, చిన్నగుండవెల్లి గ్రామం,
సిద్దిపేట రూరల్ మండలం ఎలాంటి పైరవీలు లేవు…
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూ సమస్యలు తొలిగిపోయాయి. గతంలో కంటే చేతితో పనిలేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకురావడం రైతులకు నిజంగా వరం. భూమి లెక్క పక్కాగా తేలింది. వ్యవసాయ భూమి ఎవరికి ఎంత ఉన్నది తెలుసుకోవచ్చు. దీనివల్ల పైరవీలకు తావు లేకుండా పనులు చేసుకోవచ్చు. భూ కబ్జాలకు తావు లేకుండా పోయింది. గతంలో భూమి ఒకరి మీద ఎక్కువ, తక్కువగా అయ్యేది. ఇష్టమచ్చినట్లు రాసుకునేవారు. ధరణి వచ్చిన తర్వాత వాటన్నింటికీ పరిష్కారం దొరికింది. ప్రభుత్వం ఎంతో ఆలోచించి ధరణి తీసుకువచ్చి సామాన్యుల కష్టాలను తీర్చింది. నిజంగా ధరణి రావడం అదృష్టమే.
– కేసుగారి స్వామి, రైతు, దుబ్బాక