పెద్దశంకరంపేట, జనవరి 10 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట పట్టణంలో నిర్వహించిన ఎడ్లబండ్లు, ట్రాక్లర్ల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో వ్యవసాయరంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే భూపాల్రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. మండల పరిధిలోని బుజ్రాన్పల్లి గ్రామానికి చెందిన దుర్గమ్మకు రూ.14 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, పట్టణ సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, పీఎసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని నారాయణ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగం గా సోమవారం నారాయణఖేడ్ మండలం ర్యాకల్లో ఎడ్లబండ్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబంధు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుల అభ్యున్నతి కోసం 24 గంటల విద్యుత్ సరఫరా, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, సర్పంచ్ సుజాత, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, గంగాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ జిల్లా సభ్యుడు రవీందర్నాయక్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, నాయకులు భూమయ్య, అంజయ్య పాల్గొన్నారు.