హత్నూర, ఫిబ్రవరి 3: అసైన్డ్ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఎల్లమ్మగూడ శివారులో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన “అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు” కథనంపై రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖ అధికారులు స్పందించారు. శనివారం అక్కడకువెల్లి పోలీసుల సహకారంతో ప్రహరీ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు.
గతంలో నిర్మించిన ఇండ్లకు నోటీసులు జారీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా అసైన్డ్ భూమిలో నిర్మించిన ఇండ్లకు ఏవిధంగా ఇంటి నంబర్లు కేటాయించారన్న విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అసైన్డ్ భూమి అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని, ఈవిషయంపై పూర్తిస్థాయిలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వర్క్ఇన్స్పెక్టర్ శషాంక్, గ్రామపంచాయతీ కార్యదర్శి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.