రాయపోల్ : సిద్దిపేట జిల్లా సాగునీటి సమస్యలఫై సమీక్ష నిర్వహించని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మంత్రిగా మిగిలిపోయాడని, దుబ్బాక ఎమ్మెల్యే( Dubbaka MLA ) కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kotta Prabhaker reddy ) ఆరోపించారు. సాగునీరు విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గమని వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ -అనాజీపూర్ శివారులో 13 డి కాలువ వద్ద గోదావరి జలాలకు రాష్ట్ర ఎస్సీ , ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో సాగు నీరు అందించే 13 డి కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తామంటే రాత్రి నుంచి కలెక్టర్ కార్యాలయం,ఏసీపీ, నీటి పారుదల శాఖ నుంచి అధికారులు ఫోన్ లు చేసి రాజకీయ ఒత్తిడి ఉందని అడ్డుకుని వారే నీటిని విడుదల చేశారన్నారు.

కేసీఆర్ హయాంలో తాము ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలలో పూడిక కూడా తీయడం లేదని ఆరోపించారు. నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు సాగుచేసుకుంటే కాలువ నిండా పూడిక ఉండటంతో రైతులు తలా కొంత వేసుకొని పూడిక తీసుకున్నారని వివరించారు.
రెండున్నర ఏళ్లుగా రెండేళ్లుగా ఉప కాలువలు నిర్మించాలని అసెంబ్లీ సాక్షి గా గళ మెత్తనా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఉప కాలువల నిర్మాణం కోసం భూ సేకరణ, పరిహారం, నిర్మాణం అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో మంజూరైన ఇర్కోడు ఎత్తి పోతల ప్రాజెక్ట్పనులు నత్త నడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మంతూర్ సర్పంచ్ పర్వేజ్, అనాజీపూర్ సోమని నిర్మల ఇస్తారీ , గాజుల పల్లి సర్పంచ్ పంజా స్వామి, ఇరిగేషన్ డీఈ దీప్తి, ఏఈ సుమన్, సైడ్ ఇంజనీర్ సందీప్, బీఆర్ఎస్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి, ఇప్ప దయాకర్,బార్గవ్, లింగం, తోట కమాలకర్ రెడ్డి, సర్పంచులు, నాయకులు, పాల్గొన్నారు.