న్యాల్కల్, జనవరి 10: లోకాలనేలే నాయకుడి 224వ జయంతోత్సవాలకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధి వినాయక పుణ్యక్షేత్రం ముస్తాబైంది. ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు జయంతోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రసిద్ధిగాంచిన వినాయక ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం మొదటిదికాగా, రెండోది రేజింతల్ గ్రామ శివారులోని వెలిసిన సిద్ధివినాయక ఆలయం. భక్తులు కొంగుబంగారంగా కొలిచే స్వామివారి జయంతోత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు జరిగే జయంతోత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక క్యూలైన్, అవసరమైన ప్రసాదాలు, అన్నదానం ఏర్పాట్లు చేశారు. జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో 12న ఉద యం 6 గంటల నుంచి వేదఘోష, దీప ప్రజ్వలన, ధ్వజారోహణం, స్వస్తి పుణ్యాహవాచనం, మాతృకా పూజ, ఆచార్య రిత్వికవర్ణం, ఉదయం 8 గంటలకు స్వామి వారికి అభిషేకం, 9 గంటలకు యాగశాల ప్రవేశం, దేవతాఆహ్వానం, మండపారాధన, 10 గంటలకు గణపతి హవనమం, శతచండీహవనం, మధ్యాహ్నం 2 గంటలకు మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, 13న స్వామివారికి ఆభిషేకం, 9 గంటలకు లక్ష పుష్పార్చన, 10 గంటలకు గణపతి హవనం, శతచండీహవనం, మధ్యాహ్నం 2 గంటలకు మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ, 14న స్వామివారి జయంతి సందర్భంగా విశేష ఫలపంచామృత అభిషేకం, గణపతి హవనమం, శతచండీహవనం, మధ్యా హ్నం 2.21 గంటలకు మహా పూర్ణాహుతి, మహామంగళహారతి, మహానైవేద్యం తీర్థప్రసాద వితరణ, 15న స్వామివారికి అభిషేకం, 9 గంటలకు సిద్ధిబుద్ధి సమేత స్వామివారి కల్యాణోత్సవం, 12 గంటలకు మహా మంగళ హారతి కార్యక్రమాలు జరుగుతాయి. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 12, 13, 14 తేదీల్లో జరిగే యజ్ఞాల్లో పాల్గొనే భక్తుల కోసం గణపతి హవనం, శతచండీ హవన యజ్ఞ గుండాలను సిద్ధ్దం చేశారు.
నాలుగు రోజులపాటు జరిగే రేజింతల్ సిద్ధి వినాయక స్వామి జయంతోత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ ట్రస్టు అధ్యక్షుడు రేజింతల్ అశోక్, ప్రధానకార్యదర్శి అల్లాడి నర్సింహులు కోరారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్ల సిద్ధం చేశారు. దర్శనం కోసం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదానం, తాగునీరు, వసతి సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు.