న్యాల్కల్, జనవరి 28: మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులో ఉన్న సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న వసంత పంచమి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. పంచవటీ క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో వేద పండితులు సరస్వతీ అమ్మవారితో పాటు సాయిబాబా, దత్తాత్రేయ, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర, గంగమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్థానిక క్షేత్రంలోని సూర్య భగవాన్ ఆలయంలో స్వామికి అభిషేకం, హారతి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో వేదపండితులు పలువురు దంపతులతో హోమాన్ని నిర్వహించారు. అనంతరం భజనలు, కీర్తనలు, భాజాభజంత్రీల హోరు, మహిళలు, భక్తుల ఆటపాటల మధ్య సూర్యభగవాన్ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
గుమ్మడిదలలో..
గుమ్మడిదల, జనవరి 28: శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలను కనులపండువగా నిర్వహించారు. శనివారం గుమ్మడిదల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కేవీ.నర్సింహాచార్యులు, కేవీ రంగనాథచార్యులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు పుష్పాభిషేకం చేశారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని పల్లకీ సేవలో ఊరేగించారు. మహిళలు మంగళహారులతో మంగళ నీరాజనం పలికారు. మూలవిరాట్టుకు ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
జోగినాథ స్వామి రథానికి ప్రత్యేక పూజలు
అందోల్, జనవరి 28: రథసప్తమి సందర్భంగా మండలంలోని జోగిపేట గ్రామంలో ఉన్న జోగినాథ స్వామి ఆలయం వద్ద శనివారం పూజలు చేశారు. జోగినాథ స్వామి రథానికి ఆలయ కమిటీ బాధ్యులు, పూజారి భద్రప్ప పూజించారు. తెలుగు రాష్ర్టాల్లోనే అతి పెద్ద లోహ రథంగా పేరున్న జోగినాథ స్వామి రథానికి ప్రతి రథసప్తమికి భక్తులు భారీగా తరలివచ్చారు.