రామచంద్రాపురం, జనవరి 28: తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమురంభీమ్ కాలనీలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఆర్సీపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బార్గ జిల్లా కండ్రపల్లి గ్రామానికి చెందిన జివ్వన్గాని మల్లేశం (45) మేస్త్రీ. కంద్రేయన్పల్లికి చెందిన పసుపుల చంద్రప్ప. మూడేండ్ల క్రితం మల్లేశం చంద్రప్పకు రూ.20 వేలు అప్పు ఇచ్చాడు. చంద్రప్ప కొంతకాలంగా తెల్లాపూర్లోని కొమురంభీమ్ కాలనీలో నివాసం ఉంటూ కూలీ పని చేస్తుకుంటూ జీవిస్తున్నాడు. అప్పుడప్పుడు మల్లేశం తెల్లాపూర్కు వచ్చి డబ్బులు ఇవ్వమని చంద్రప్పను అడిగేవాడు. ఈనెల 24న చంద్రప్ప ఇంటికి మల్లేశం వచ్చి డబ్బులు అడిగాడు. నాలుగైదు రోజుల్లో ఇస్తానని మల్లేశాన్ని నమ్మించి, మద్యం తాగించాడు.
మల్లేశాన్ని చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కుట్రపన్ని అదే రోజు రాత్రి కొమురంభీమ్ కాలనీలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి మల్లేశం తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గడ్డి, కట్టెలతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుడి కుమారుడు నర్సింహ తెల్లాపూర్లోని ఇందిరానగర్లో తిరుగుతూ కల్లు దుకాణంలో తన తండ్రి గురించి ఆరా తీశాడు. కల్లు దుకాణాంలో అతను ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లాడు. ఆ సమయంలోనే పోలీసులు కేసు విచారణలో భాగంగా సీసీ ఫుటేజీ ఆధారంగా కల్లు దుకాణం వద్దకెళ్లి ఆరా తీయడంతో ఒక వ్యక్తి వచ్చి తన తండ్రి కోసం అడిగి వెళ్లాడని, అతడి ఫోన్నంబర్ పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ నంబర్కు ఫోన్ చేసి అతడిని పిలిపించి వివరాలు సేకరించారు. అతడి సహకారంతో ఆ ఊరికి సంబంధించిన వారిని కలవడంతో అక్కడ హత్య చేసిన చంద్రప్ప ఉన్నాడు. అతని ప్రవర్తన అనుమానంగా ఉండడంతో పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చి విచారించడంతో మల్లేశాన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో శనివారం పోలీసులు చంద్రప్పను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 24 గంటలో కేసును ఛేదించినందుకు ఇన్స్పెక్టర్, ఎస్సై, క్రైం సిబ్బందిని సీపీ, డీసీపీ అభినందించారు.
హత్య కేసును ఛేదించిన ఆర్సీపురం పోలీసులు