న్యాల్కల్/కొల్చారం, జూన్ 28 : వానకాలం ఆరంభమైంది. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయి. గాలి, నీరు, ఆహారం ద్వారా అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. వానలు కురుస్తుండడంతోనే క్రిమికీటకాదులు దోమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రాకుండా అరికట్టడం ముఖ్యం. వానలకు చెరువులు, కుంటల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతుంది. నీటిగుంటల్లో దోమలు నివాసాలు ఏర్పరుచుకుంటాయి. నీరు కలుషితం అవుతుంది. ఈగల ద్వారా ఆహారం కలుషితమవుతుంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు, డెంగీ, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నీటి కాలుష్యంతో డయేరియా, టైఫాయిడ్, నిల్వ చేసిన నీటితో దోమలు పెరిగి మలేరియా వ్యాప్తి చెందుతుంది. వానకాలం వచ్చిందంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటిని నిల్వ ఉంచరాదు. ఇంటిలో పాత టైర్లు, కొబ్బరిచిప్పలు, పాత కుండీలను నీరు నిలువ ఉండకుండా బోర్లవేయాలి. కాచి వడపోసిన నీరు లేదా శుద్ధిచేసిన నీటిని మాత్రమే తాగాలి. గోరువెచ్చిని నీరు తాగడం ద్వారా గొంతు సంబంధిత సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. కొంచెం గొంతునొప్పి అనిపించినా ఉప్పునీటితో పుక్కిలించాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు తయారుచేసుకుని వేడివేడిగా భుజించాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఆ సమయంలో చేతిరుమాలను అడ్డుపెట్టుకోవాలి.
వర్షంలో తడిస్తే ముందుగా వచ్చేది జలుబు. దీంతో జ్వరం, దగ్గు కామన్గానే వచ్చేస్తుంది. జలుబు అంటువ్యాధి. శరీరంలో తగినంత వ్యాధి నిరోధక శక్తి లేకపోవడంతో కొంతమంది వర్షంలో తడిసినా, తడుస్తున్నా సరే జలుబు వస్తూనే ఉంటుంది. అది తగ్గడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైద్యులను సంప్రదించి చికిత్సలు చేసుకోవాలి.
కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా టైఫాయిడ్ బారిన పడతారు. ఈ బ్యాక్టీరియా ప్రేగునాళాల ద్వారా వ్యాపించి ప్రేగు గోడల్లోకి చొచ్చుకొని పోయి రక్తంలో ప్రవేశిస్తుంది. టైఫాయిడ్ జ్వర లక్షణాల్లో జ్వరం ఎక్కువగా 104 ఫారెన్హీట్ డిగ్రీ ఉండి తగ్గకపోవడం, విపరీతమైన చెమటలు, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, రక్తంలేని విరేచనాలు ఉంటాయి. అరుదైన సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స పొందని టైఫాయిడ్ జ్వరంతో మరణం కూడా సంభవించవచ్చు.
వానకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తున్నాయి. ఇంటి పరిసరాల్లోని పెంటకుప్పలు, చెత్తాచెదారం, మురుగుకాల్వలు, తాగునీటి గుంతల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచే అవకాశం ఉంటుంది. అక్కడ రోజుల తరబడి నీరు నిలువ ఉంటే దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులకు కారకాలుగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డయేరియా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటిస్తే జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఆహారం, నీటి కాలుష్యం బారినపడకుండా జాగ్రత్త వహించాలి. పల్లె, పట్టణ ప్రగతి అమలు తర్వాత సీజనల్ వ్యాధులు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయినా
అజాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మలేరియా దోమల ద్వారా వ్యాపించే అనారోగ్య సమస్య. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే ఆధారపడతాయి. మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది. ఆ లాలాజలంలో స్పోరోజాయిట్స్ ఉంటాయి. అవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి అవి మీరోజాయిట్స్గా కాలేయం, ఎర్రరక్త కణాల్లో పరిణతి చెందుతాయి. ఇలా పరిణతి చెందిన మీరోజాయిట్స్ ద్వారా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అన్ని దోమలు మలేరియాను వ్యాప్తి చేయవు. కేవలం అనోఫిలస్ అనే జాతి ఆడ దోమల వల్ల మాత్రమే మనుషులకు మలేరియా సోకుతుంది. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుంచి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వలన, లేదా వ్యాధిగ్రస్తుడు వాడిన సిరంజిని వాడడంతో కూడా మలేరియా బారిన పడవచ్చు.
డయేరియా (అతిసార) బారినపడినప్పుడు విరేచనాలతో పాటు జ్వరం, వాంతులు, దాహం ఎక్కవ కావడం, నీరసం, గుండెదడ, నోరు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, కడుపునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో డీహైడ్రేషన్ ఎక్కువేతే నాడివేగం తగ్గి అపస్మారక స్థితికి గురవుతారు. పిల్లలు, వృద్ధుల్లో డయేరియా సమస్య ఎక్కువైతే కోలుకోవడం కష్టం.
ఏడిస్ ఈజిప్ట్ అనే దోమకాటుతో డెంగీ బారినపడతారు. ఈ దోమ పగటిపూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లంతా దద్దర్లు కనిపిస్తాయి. ఈ దోమ కుట్టడంతో వైరల్ జ్వరం మాదిరిగానే అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. రోగికి తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులుతో ఎముకల విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం కలగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు ఉదర భాగాల చర్మలపై ఎర్రగా కందినట్లు చిన్న చిన్న మొటిమల కనిపిస్తాయి. ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది.
జపనీస్ బీవైరస్ అనే సూక్ష్మజీవి దోమల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. పందులు, పశువులు, పక్షుల్లో వైరస్ స్థావరాలు ఉంటాయి. వీటిని కుట్టిన దోమలు మనిషికి కుడితే వ్యాప్తి చెందుతుంది. పిల్లల్లో ఎక్కవ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకడంతో మూడో వంతు మంది ప్రాణాలు కోల్పోతారు. పక్షపాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బుద్ధిమాంద్యం, వినికిడి లోపాలు, దృష్టిలోపాలు వంటి అంగవైకల్యాలతో జీవితాంతం బాధపడుతుంటారు. వెంటనే వైధ్యాధికారులను సంప్రదించి చికిత్సలు చేసుకోవడం మంచిది.
చికున్ గున్యా అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది ఏడెస్ అనే దోమకాటుతో వస్తుంది. ఈ వ్యాధి సోకిన రోగికి తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. చికెన్గున్యా సోకితే మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కవ ఉంటుంది. ఆ తర్వాత జ్వరం తీవ్రత తగ్గినా, కీళ్ల నొప్పులు మాత్రం ఉంటాయి.
వానకాలం రావడంతోనే దోమలు, ఈగలు వంటి క్రిమికీటకాలు పెరుగుతాయి. వాటితోనే తొంబై శాతం అంటురోగాలు ప్రబలుతాయి. అంటురోగాలు వచ్చాక హైరానా పడే బదులు ముందుగా అప్రమత్తతే ముఖ్యం. ఇంటిలో నీటిని నిల్వ ఉంచే తొట్లు, పాత టైర్లు, కొబ్బరిచిప్పలు తీసివేయాలి. కలుషితమైన నీటిని తాగరాదు. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగడమే అన్నింటికి శ్రేయస్కరం. ఏ మాత్రం జ్వరం వచ్చినా డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.
– రమేశ్, మెడికల్ ఆఫీసర్, కొల్చారం, మెదక్ జిల్లా
వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు రాకుం డా సాయంత్రం ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలి. నీళ్లుకాచి వడగట్టి తాగితే మంచిది. నీటి గుంటల్లో ఆయిల్స్ బాల్స్ వేయాలి. కూరగాయలు, మాంసం శుభ్రంగా కడిగిన తర్వాతే వండాలి. పూర్తిగా ఉడికిన తర్వాతే వేడివేడిగా ఆహార పదార్థాలు తినాలి. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. జబ్బుల బారినపడితే వైద్యులను సంప్రదించాలి. వ్యాధులతో అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.
– నృపేన్ చక్రవర్తి, పీహెచ్సీ వైద్యాధికారి, మిర్జాపూర్(బి), సంగారెడ్డి జిల్లా