భక్తజన సంద్రమైన రాఘవపూర్ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం
చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు
బోనాలు, పల్లకీ సేవతో తరలివచ్చిన భక్తులు
శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన
ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
న్యాల్కల్, ఫిబ్రవరి 5 : రెండో బాసరగా విరాజిల్లుతున్న చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుదీరిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ పంచవటీ క్షేత్రం భక్తజన సంద్రమైంది. సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి..శ్లోకాలతో అమ్మవారి సన్నిధి మార్మోగింది. శనివారం వసంత పంచమిని పురస్కరించుకుని క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, సరస్వతీ యాగం, హారతి తదితర పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాత, సరస్వతీ అమ్మవారితో పాటు సాయిబాబా, సూర్యభగవాన్ ఆలయాల్లో పూజలు చేశారు. క్షేత్ర ఆవరణలో ఏర్పాటు చేసిన పద్మవ్యూహంలో భక్తులు కలియతిరుగుతూ మధ్యలో ఉన్న దుర్గామాతను దర్శించుకున్నారు.చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు ఆయా ప్రాం తాల నుంచి తల్లిదండ్రులు తరలివచ్చారు. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా, వేదపండితులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. భాజాభజంత్రీల హోరు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో కాశీనాథ్బాబా వేలాది మంది భక్తులతో కలిసి మంజీరా నది వరకు రథంలో ఊరేగింపుగా తరలివెళ్లారు. అనంతరం మంజీరా నదిలో గంగమ్మకు పూజలు చేసి తెప్పను విడిచిపెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి బోనాలతో తరలివచ్చిన మహిళలు మంజీరా నది వద్ద గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం గంగామాత ఆలయంలోని అమ్మవారితో పాటు శివలింగానికి భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు బోనాలతో పంచవటీ క్షేత్రానికి తరలివచ్చారు. విద్యార్థుల చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవనంద సరస్వతీ మహారాజ్, బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరిమహారాజ్, సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ దంపతులు పంచవటీ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజ్ ఆధర్యంలో రూరల్ సీఐ భరత్కుమార్, హద్నూర్ ఎస్సై వినయ్కుమార్, రాయికోడ్ ఎస్సై ఏడుకొండలు, ఏఎస్సై ఈశ్వర్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వసంత పంచమి వేడుకలల్లో భాగంగా ఆదివారం సరస్వతీ ఆమ్మవారికి డోలారోహణం, వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సం నిర్వహిస్తా మని క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా తెలిపారు.