కోహీర్, మార్చి14: బడంపేట రాచన్నస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు గర్భగుడిలోని శివలింగానికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం గంగపూజ, గోమాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, నాందిసమారాధన, అఖండ దీపారాధన నిర్వహించారు. అనంత రం తంగడపల్లి ఆశ్రమ పీఠాధిపతి శివయోగి శివాచార్య మహాస్వామి చేతుల మీదుగా ధ్వ జారోహణం, శిఖర పూజను నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. దీంతో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
వీరభద్రావతారంలో కొలువుదీరిన రాచన్నస్వామితోపాటు సమీపంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా భక్తు లు ప్రత్యేక పూజలు చేశారు. 300 సంవత్సరాల క్రితం రాచన్నస్వామి తపస్సు చేసిన అయ్యగుహలో పూజలు చేశారు. బిలాల్పూర్ కళాకారుతో భజన కీర్తనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం అగ్ని ప్రవేశం చేయనున్నారు. ఉత్సవాల్లో ఈవో శివరుద్ర ప్ప, జగదీశ్వర్స్వామి, దయానంద్ పాటిల్, శివమూర్తిస్వామి, భుజంగం పాల్గొన్నారు.