లోఓల్టేజీ లేకుండా నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత మాదే
హుస్నాబాద్ సర్కారు దవాఖానలో సకల సౌకర్యాలతో వైద్యసేవలందిస్తాం
ఐదు పడకలతో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు
పది రోజుల్లో దవాఖానలో ఆపరేషన్లు ప్రారంభం
రైతులు, దళితులు,గిరిజనులను మోసం చేస్తున్న బీజేపీ సర్కారు
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుదాం..
రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
హుస్నాబాద్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి
హుస్నాబాద్, ఫిబ్రవరి 8: మెట్ట, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు హుస్నాబాద్ లాంటి మెట్టప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్య, కరెంటు కోతలతో రైతులు బాయిలవద్దే పడిగాపులు కాసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి దూరమైందన్నారు. రైతులు, దళితులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై, ఇక్కడి దళిత, గిరిజనులు, ప్రజలపై బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు దీనిని నిజం చేస్తున్నాయన్నారు.దళితబంధుతో ఎస్సీల తలరాత మారుతుందన్నారు.
మెట్ట, వెనుకబడిన ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి రూ.22కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక సర్కారు దవాఖానను సందర్శించి సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు డీఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు హుస్నాబాద్ లాంటి మెట్టప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్య, కరెంటు కోతలతో రైతులు బాయిలవద్దే పడిగాపులు కాసే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక అలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. కోహెడ మండలం నాగసముద్రాల గ్రామ శివారులో రూ.50కోట్లతో 220/132కేవీ సబ్స్టేషన్ పనులు మార్చి 31వ తేదీలోపు పూర్తవుతాయని తెలిపారు. రామవరం, సీసీపల్లిలోని సబ్స్టేషన్లను కూడా మార్చిలోపు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని రైతులు, దళితులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతితో పాటు రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. తెలంగాణ రాష్ట్రంపై, ఇక్కడి దళిత, గిరిజనులు, ప్రజలపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు సన్నద్ధ్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్స్టేషన్ పక్క గ్రౌండ్లో జరుగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో బ్యాటింగ్ చేసి యువతను, క్రీడాకారులను మంత్రి ఉత్సాహ పరిచారు.
సకల సౌకర్యాలతో హుస్నాబాద్ సర్కారు దవాఖాన…
నియోజకవర్గ కేంద్రంలోని సర్కారు దవాఖానను సకల సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. దవాఖానలోని సౌకర్యాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం వైద్యాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, పేదలు ఉన్నందు న, వారికి అన్ని రకాల వైద్యసేవలను అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న 50పడకల దవాఖాన భవనం పక్కనే, మరో 30 పడకల సామర్థ్యంతో భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. పాత దవాఖాన భవనానికి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని పరికరాలు ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్లు నిరుపయోగంగా ఉంటున్నాయని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పది రోజుల్లో ఆపరేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్థోపెడిక్ వైద్య చికిత్సల కోసం సియామిషన్ సేవలు వినియోగించాలని, ఇప్పటికే ఉన్న ఎక్స్రే మిషన్ వినియోగంలోకి తేవాలని అన్నారు. రోగుల సౌకర్యార్ధం ఆధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ ఎక్స్రే మిషన్, డెంటల్ చైర్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
దవాఖానలో బ్లడ్ స్టోరేజీ సెంటర్ను వారం రోజుల్లో ప్రారంభించాలని, ఐదు పడకలతో డయాలిసిస్ కేంద్రం త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. శానిటేషన్ సిబ్బంది పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. దవాఖానలో గర్భిణు లు, బాలింతలకు వైద్యసేవలను మరింత పెంచేందుకు అదనంగా గైనకాలజిస్ట్ డాక్టర్ పోస్టు ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దవాఖనలో ఉన్న నిధులను వినియోగించుకొని సిబ్బందిని నియమించుకొని నిరంతర వైద్యసేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పేర్యాల రవీందర్రావు, వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, జడ్పీ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మీ, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్రాంరెడ్డి, ఎండీ అన్వర్, గోపాల్రెడ్డి, ఆకుల వెంకట్, తిరుపతిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, మార్కెట్ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.