గజ్వేల్, డిసెంబర్ 3 : స్వర్ణకారుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పించి వృత్తిని పరిరక్షించాలని గజ్వేల్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు తిప్పోజు మురళీధర్చారి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుచారి కోరారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని స్వర్ణకారులు దుకాణాలను మూసివేశారు. స్వర్ణకార సంఘం భవనంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వర్ణకారులను ఆదుకోవాలని కోరుతూ గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ బాలరాజును కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా స్వర్ణకారులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలు స్వర్ణాభరణాలను విక్రయించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వర్ణకారులు ఉపాధిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ కార్యక్రమాలకు వినియోగించే పుస్తెమట్టెలు, ప్రధాన ఉంగరాలు తదితర వస్తువులు స్వర్ణకారులతో చేయ డం ఆచారంగా వస్తున్నదని, వాటిని కూడా కార్పొరేట్ సంస్థలే విక్రయిస్తుండడంతో స్వర్ణకారులకు పనిలేకుండా పోయిందన్నారు. సాంప్రదాయ ఆభరణాలైన పుస్తెమట్టెలు, ఉంగరాలు, ముఖ్యమైన వాటిని స్వర్ణకారులు మాత్రమే తయారు చేసే విధంగా ప్రభుత్వం జీవో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సత్యంచారి, నాయకులు శ్రీనివాస్చారి, వెంకటేశంచారి, రామచంద్రంచారి తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్, డిసెంబర్ 3 : ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకోవాలని హుస్నాబాద్ పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కందుకూరి సదానందం ప్రభుత్వాన్ని కోరారు. హుస్నాబాద్లోని నెహ్రూ చౌక్లో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారితోపాటు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోకొల్లలుగా వెలుస్తున్న జ్యువెలరీ షాపులతో స్వర్ణకారులకు ఉపాధి కరువైందని, దీంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రాచారి, నాయకులు వీరాచారి, చొక్కా చారి, శ్రీనివాస్చారి పాల్గొన్నారు.