సంగారెడ్డి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. గతనెల 16వ తేదీ వరకు సింగూరు ప్రాజెక్టులో 18 టీఎంసీల జలాలు ఉండగా, ఎగువన ఉన్న కర్ణాటకలో ఎడతెరపిలేని వర్షాలకు మంజీరాలోకి వరద రావటం ప్రారంభమైంది. దీంతో ఈ నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టులోకి వరద పెద్ద ఎత్తున చేరడంతో జలకళ సంతరించుకున్నది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, వరదలతో జూలై 21 వరకు ప్రాజెక్టులో నీటి మట్టం 20.004 టీఎంసీలకు చేరింది. వర్షాలు కొనసాగుతుండడంతో ప్రతి రోజు ప్రాజెక్టులోకి 4వేల క్యూసెక్కుల నుంచి 10 నుంచి గరిష్టంగా 25,607 క్యూసెక్కుల జలాలు వచ్చాయి.
28న ప్రాజెక్టులో నీటిమట్టం 24.274 టీఎంసీలకు చేరగా, 29న 25.261 టీఎంసీలకు చేరుకుంది. కాగా, పైన భాగంలో కురిసిన వర్షాలకు గురువారం వరకు 27.396 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టులోకి మరో 2.521 టీఎంసీల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద తగ్గింది. ఇప్పుడు ప్రాజెక్టులోకి 700 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రోజుకు 10వేల క్యూసెక్కుల జలాలు వస్తే మరో మూడు రోజుల్లో సింగూరు ప్రాజెక్టు పూర్తిగా 29 టీఎంసీలకు చేరే అవకాశం ఉన్నది. గతేడాది నవంబర్లో భారీ వర్షాలు కురువడంతో సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండింది.
సింగూరు ప్రాజెక్టు దిగువన ప్రభుత్వం హైడల్ పవర్ ప్రాజెక్టును నిర్మించింది. పవర్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన రెండు టర్బైన్ల ద్వారా రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉ్పత్పత్తికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు నిండుగా ఉండటంతో హైడల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. గత నెల 31 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి, ప్రతిరోజు 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజు 2822 క్యూసెక్కుల జలాలను వినియోగిస్తున్నారు. 1999లో ప్రారంభమైన సింగూరు హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో ఏటా 1.6 నుంచి గరిష్టంగా 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. 2022-23లో అత్యధికంగా 30.42 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. సింగూరులో ఉత్పత్తి అయిన విద్యుత్ను తెలంగాణ పవర్ గ్రిడ్కు పంపుతారు. అక్కడి నుంచి విద్యుత్ పంపిణీ జరుగుతుంది.
సింగూరు ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ పథకానికి 2 టీఎంసీల జలాలను కేటాయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 27 టీఎంసీలకు చేరుకున్నది. దీంతో మిషన్భగీరథకు ఏడాదికిపైగా నీళ్లు ఇవ్వవచ్చు. సంగారెడ్డి జిల్లా ప్రజల నీటి అవసరాలతోపాటు కామారెడ్డి జిల్లాకు సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీటి మిషన్భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో జలాలు నిండుగా ఉండటంతో రెండు జిల్లాలో తాగునీటి కొరత లేనట్టేనని అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామంలోని సింగూరు ప్రాజెక్టు నిండటంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 27 టీఎంసీలకు పైగా జలాలు ఉండటంతో ఆయకట్టు రైతులు వానకాలంలో 40వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సాగునీరు విడుదల చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇచ్చేవారు కాదు. సింగూరు ప్రాజెక్టు నిండినా వాటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగించేవారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మంజీరా జలాలను పూర్తిగా జిల్లా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు కాల్వలను మరమ్మతులు చేసి ఆయకట్టు కింద ఉన్న 40వేల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందిస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటితో నిండుగా ఉన్నందున పుల్కల్, చౌటకూరు, అందోలు మండలాల్లోని 40వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇటీవలే ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సింగూరు ప్రాజెక్టు కాల్వల ద్వారా పంటపొలాలకు సాగునీటి వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద రైతులు వరి వేయగా, అవసరమైన సమయంలో ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. సింగూరు ద్వారా ఘనపురం ఆనకట్టకు ఒకటి నుంచి మూడు టీఎంసీల వరకు జలాలను పంటల సాగుకోసం విడుదల చేస్తున్నారు. అవసరమైన సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు సైతం సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల చేస్తారు.
సింగూరు నిండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. ప్రాజెక్టులో మత్స్యకారుల కోసం మత్స్యశాఖ పెద్ద మొత్తంలో చేప, రొయ్య పిల్లలను వదిలారు. దీంతో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారులు చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు. సింగూరు ప్రాజెక్టులో పట్టే చేపలకు మంచి డిమాండ్ ఉంది. ప్రాజెక్టు నిండటంతో ప్రతిరోజు సందర్శకులు పెద్ద సంఖ్యలో సింగూరు ప్రాజెక్టును చూసేందుకు సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు వస్తున్నారు. దీంతో సింగూరు ప్రాజెక్టు ప్రాంతం సందడిగా కనిపిస్తున్నది.
పుల్కల్, ఆగస్టు3: బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి 9టీఎంసీల నీరు వచ్చిచేరింది. బుధవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 500 క్యూ సెక్యులు మాత్రమే చేరినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 27.357టీఎంసీల నీరు ఉన్నది. 355 క్యూసెక్కల నీరు అవుట్ఫ్లో వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్రెడ్డి తెలిపారు.