గజ్వేల్, ఏప్రిల్ 8: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తుండడంతో రైతులు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన దూలం రాజాగౌడ్ నాలుగెకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగుచేశాడు. అందులో అంతర పంటగా అరటి తోటను సాగు చేస్తున్నాడు. మూడేండ్ల పాటు ఆయిల్పామ్ పంటను కాపాడితే 30ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది.
ఏడాది క్రితం ఎకరానికి 57 మొక్కల చొప్పున అధికారుల సూచనలతో తొమ్మిది మీటర్లకు ఒకటి చొప్పున పెట్టాడు. ఆయిల్పామ్ మొక్కల మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడంతో అందులో ఆరు నెలల క్రితం 1200 అరటి మొక్కలను తీసుకొచ్చి నాటాడు. ఒకటి, రెండు అరటి మొక్కలు అప్పుడే కాతకొచ్చాయి.
అడవి జంతువుల నుంచి రక్షణకు సౌరకంచె…
రైతు రాజాగౌడ్ సాగుచేసిన ఆయిల్పామ్ కూడవెల్లి వాగు పక్కనే ఉండడంతో రాత్రి సమయంలో అడవి జంతువులు అధికంగా సంచరిస్తుంటాయి. ఆయిల్పామ్లో అంతరపంటగా సాగు చేసిన అరటిని కాపాడుకునే క్రమంలో నాలుగెకరాల చుట్టూ సౌర కంచెను ఏర్పాటు చేశాడు. రాత్రి సమయంలో వచ్చే అడవి జంతువులు, కోతులు సౌరకంచెను తాకగానే కరెంట్ సరఫరా కావడంతో అక్కడి నుంచి పారిపోతాయి.
రైతు సాగు చేసిన అరటి పంటను రాత్రి సమయంలో అడవి పందులు ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నది. దీంతో అరటి తోటలను రక్షించుకునే క్రమంలో సౌర పలకలు, సోలార్ తీగలను తీసుకొచ్చి చుట్టూ కంచెలాగా ఏర్పాటు చేశాడు. ఈ సౌర కంచెతో అడవి జంతువులకు ఎలాంటి ప్రాణనష్టం ఉండదు. డబ్బులు ఖర్చు చేసి సాగు చేసిన అరటి పంటను రక్షించుకునేందుకు రాజాగౌడ్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సాగుచేశా..
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుచేసే రైతులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో నేడు చాలామంది రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఆయిల్పామ్ మొక్కలను తొమ్మిది మీటర్లకు ఒకటి చొప్పున పెట్టడంతో ఖాళీ ప్రదేశంలో అరటి మొక్కలు సాగు చేశా. ఇప్పటికి పంట బాగానే ఉంది. అడవి జంతువుల నుంచి అరటి తోటలను రక్షించుకోవడం కోసం సౌర కంచెను ఏర్పాటు చేశా.
– దూలం రాజాగౌడ్, రైతు, కొడకండ్ల , సిద్దిపేట జిల్లా