సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డేటాఎంట్రీపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులను ఈనెల 16 నాటికి డేటాఎంట్రీ పూర్తి చేయాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
సంగారెడ్డి, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి :సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తామని నూతన కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వీ మెంచు నగేశ్ స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్లో వల్లూరు క్రాంతి నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఓ వైపు పట్టణ ప్రాంతాలు, మరోవైపు గ్రామీణ ప్రాం తాలు ఉన్నాయని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో సమాంతరంగా అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. కమిషనర్గా పనిచేసిన అనుభవంతో జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు జరిగేలా చూస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా కృషిచేస్తానని తెలిపారు. అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజాపాలన ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. విద్య, వైద్యం, మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటానని నూతన కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వల్లూరు క్రాంతిని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో మెంచు నగేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో రవీందర్రెడ్డి, జిల్లా శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి సన్మానించారు.
సంగారెడ్డి నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వల్లూరు క్రాంతి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. శాఖల పనితీరుకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. అనంతరం ప్రజాపాలనపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన వచ్చిన అభయహస్తం దరఖాస్తులను 16వ తేదీ వరకు డాటాఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం ప్రజాపాలనపై కలెక్టర్ క్రాంతి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.