ఆమనగల్లు,డిసెంబర్ 7 : యాసంగి సీజన్లో వరి పంటను రైతులు సాగు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని వ్యవసాయ అధికారి అరుణకుమారి రైతులను కోరారు. మంగళవారం మండలంలోని సింగంపల్లి, సంకటోనిపల్లి, ఆకుతోటపల్లి, రాంనుంతల గ్రామాల్లో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రైతులకు ఆరుతడి పంటల సాగు విధానాల పై అవగాహన కల్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన ఇతర పంటలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆరుతడి పంటల సాగు విధానం మార్కెట్లో పంటలకు ఉన్న డిమాండ్ను వివరించారు. కార్యక్రమంలో ఏఈవోలు శివతేజ, మౌన్యరెడ్డి, సాయిరాం, రాణి పాల్గొన్నారు.
ఇతర పంటలు సాగు చేయాలి
కడ్తాల్ : రైతులు యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ ఏవో శ్రీలత అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చరికొండ, రావిచేడ్, బాలాజీనగర్తండా, మైసిగండి గ్రామాల్లోని రైతులకు ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయశాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో శ్రీలత మాట్లాడుతూ మినుములు, పెసర, ఆముదం, కుసుములు, రాగులు, జొన్నలు, నువ్వులు, కూరగాయాలను సాగు చేయాలని తెలిపారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు భారతమ్మ, తులసీరాంనాయక్, కమ్లీబీచ్చానాయక్, నర్సింహగౌడ్, విఠలయ్య, ఏఈవోలు రమణ, సరిత, తేజస్వినీ, స్వాతి, రైతులు పాల్గొన్నారు.
పంట సాగు పోస్టర్ ఆవిష్కరణ
తలకొండపల్లి : యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. మండలంలోని అంతారం, ఇస్రాయిపల్లి గ్రామాలలో రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఇతర పంటల సాగుకు సంబంధించిన అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతులు రాములు, జంగయ్య, కృష్ణ, యాదగిరి, వెంకటయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.