మెదక్ మున్సిపాలిటీ, మార్చి 11: మరో 18 రోజుల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. దీంతో బల్దియా అధికారులు ఆస్తి పన్నుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మార్చి చివరి నాటికి బకాయిలు వసూళ్లు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ సంచాలకుడు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించడంతో సిబ్బంది ఆ దిశగా ముమ్మర వసూళ్లకు సిద్ధమయ్యారు. మున్సిపల్కు ప్రధాన వనరు ఆస్తి పన్ను వసూళ్లు పూర్తిస్థాయిలో చేపట్టాలని బల్దియా నిమగ్నమైంది. మొండి బకాయిదారుల వివరాల జాబితా ఇప్పటికే సిద్ధ్దం చేసినట్లు అధికారులు తెలిపారు. నివాస, వాణిజ్య సముదాయలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. పన్నులు వసూలు చేయడానికి ఆరుగురు బిల్ కలెక్టర్లతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. పట్టణంలో 32 వార్డులు ఉండగా నివాస గృహాలు, వ్యాపార వాణిజ్య సముదాయలు కలిపి 11,835 ఉన్నాయి. ఇందులో నివాస గృహాలు 9,965, వ్యాపార వాణిజ్య భవనాలు 1,203 ఉన్నాయి. మొత్తం పన్నులు రూ.6.13 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.3.56 కోట్లు వసూలయ్యాయి. కాగా మిగతా రూ.2 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 62 శాతం వసూలుచేశారు. మొండి బకాయిదారుల విషయంలో యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొండి బకాయిదారులు ఆస్తి పన్నులు చెల్లించలేని పక్షంలో చర్యలు తీసుకోబడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మార్చి 31 లోగా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించే అవకాశం
మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ 9000253342ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో మున్సిపల్ సిబ్బంది, ఇంటి యజమానులకు సేవలు సులభతరం కానున్నాయి. 9000253342 ద్వారా చాట్ చేసి ఆస్తి యజమానులు తాము చెల్లించాల్సిన పన్ను వివరాలను తెలుసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మినహా 140 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎవరైనా దీన్ని వినియోగించుకోవచ్చు. వివరాలు తెలుసుకుని పన్ను చెల్లించవచ్చు. ఈ నంబర్ను సెల్ఫోన్లో సేవ్ చేసుకుని క్లిక్ చేయగానే మున్సిపల్ శాఖ స్వాగత సమాచారం అందుతుంది. తెలుగులో కానీ, ఇంగ్లిష్లో గాని సమాచారం పొందే వీలు కల్పించారు.
లక్ష్యం సాధించే దిశగా..
ఆస్తి పన్ను వసూళ్లు వంద శాతం సాధించేలా తగిన ప్రణాళికలు రూపొందించాం. ఇంటింటికీ వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొండి బకాయిదారుల వివరాల జాబితాను రూపొందించేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలుచేస్తాం. ఆస్తి పన్నుదారులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– జానకీరామ్ సాగర్,మున్సిపల్ కమిషనర్, మెదక్