చేర్యాల, డిసెంబర్ 15 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణ ఘడియలు సమీపిస్తుండడంతో ఆలయవర్గాలు మల్లన్న క్షేత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 18న స్వామి వారి కల్యాణోత్సవానికి పెండ్లి పనులను ఆలయ వర్గాలు ముమ్మరం చేశాయి. స్వామి వారి ఆలయంలోని అర్థ మండపం, మహామండపంతో పాటు మల్లన్న మూలవిరాట్టు సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు తోటబావి వద్ద నిర్మించి కల్యాణ వేదిక వద్ద భారీగా షామియానాలతో పాటు టెంట్లు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న క్షేత్రంలోని ప్రధాన వీధుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి స్వామి వారి ఆలయానికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. దీపాలు ఏర్పాటులో భాగంగా మొదటగా ఆలయ రాజగోపురానికి దీపాలు వేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అలాగే తిరుపతిలో తయారువుతున్న స్వామి వారి బంగారు కిరీటం త్వరగా తీసుకువచ్చేందుకు ఆలయ అధికారులు, పాలక మండలి చర్యలు తీసుకుంటున్నారు.
మల్లన్న దర్శనం సులభంగా సకాలంలో పూర్తి చేసేందుకు శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్లు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్న క్రమంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు రావడంతో అదే ప్రదేశంలో తాత్కాలికంగా కర్రలతో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు కాటేజీలను శుభ్రం చేయడం, విద్యుత్ కనెక్షన్లు సరిచేసుకోవడంతో పాటు సీసీ కెమెరాల మరమ్మతులు, కొత్తగా ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. స్వామి వారి పెండ్లి వేడుకలకు కావాల్సిన పెండ్లి బట్టలను సైతం పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓ షాపులో ఈవో అలూరి బాలాజీ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు.