Swachh badi | బడి అనగానే విద్యార్థులు ఉంటారు.. ఉపాధ్యాయులు బోధిస్తారు అనుకుంటాం. కానీ, ఇక్కడ చెత్త పునర్వినియోగం.. చెత్త నుంచి సంపద ఎలా పొందవచ్చో చెప్పేదే స్వచ్ఛబడి అన్న మాట. దేశంలోనే తొలి స్వచ్ఛబడిని బెంగళూరులో ఏర్పాటు చేయగా, రెండోది సిద్దిపేట బల్దియా పరిధిలోని మాతాశిశు పాత దవాఖాన ఆవరణలో రూ. కోటితో 2000 గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ స్వచ్ఛ బడిని 2021 ఏప్రిల్, 10న ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించగా.. ఈనెల 12న పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సందర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో స్వచ్ఛబడిని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. సిద్దిపేటలో చెత్తకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు చెత్త పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి చెత్త నుంచి సంపదను పొందుతున్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల పాలకవర్గాలు, అధికారుల బృందాలతోపాటు దేశంలోని ఆయా రాష్ర్టాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు స్వచ్ఛబడిని సందర్శించి అద్భుతమని ప్రశంసించారు.
సిద్దిపేట, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బడి అనగానే విద్యార్థులు ఉంటారు అనుకుంటాం…! అక్కడ పాఠ్యాంశాలు బోధిస్తారనుకుంటారు..! కానీ, ఇక్కడ చెత్త పునర్వినియోగం….చెత్త నుంచి సంపదను ఎలా పొందవచ్చునో చెప్పేదే స్వచ్ఛబడి అన్న మాట. భారతదేశంలోనే తొలి స్వచ్ఛబడిని బెంగళూరులో ఏర్పాటు చేయగా, రెండోది సిద్దిపేట బల్దియా పరిధిలో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మాతాశిశు పాత దవాఖాన ఆవరణలో రూ. కోటితో 2000 గజాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ స్వచ్ఛ బడిని 2021 ఏప్రిల్ 10న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు.
దీనిని ఈనెల 12న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సందర్శించారు. అక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో స్వచ్ఛబడిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దిశగా రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. బెంగళూరులో 2018లో స్వచ్ఛగ్రహ చెత్త విలువను తెలియజేసే ఒక పాఠశాల ఉందని మంత్రి హరీశ్రావు తెలుసుకొని అక్కడికి ఒక బృందాన్ని పంపారు. ఇది దేశంలోనే తొలిది కావడం చేత, సిద్దిపేట నుంచి అధికారులు పాలకవర్గ సభ్యులు బృందంగా అక్కడికి వెళ్లి చెత్తను ఎలా పునర్వినియోగం చేస్తున్నారో స్వయంగా చూసి వచ్చారు. అక్కడి ఫలితాలు బాగా ఉండడంతో సిద్దిపేటలో ‘స్వచ్ఛబడి’కి 2021 ఏప్రిల్ 10న శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలో చెత్తకు శాశ్వత పరిష్కారంతో పాటు చెత్త పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇక్కడ దీనిని ప్రారంభించారు. చెత్తను పునర్వినియోగం చేయడంతో పాటు చెత్త నుంచి సంపదను పొందుతున్నారు. సిద్దిపేట స్వచ్ఛబడి స్థానిక వార్డు నుంచి 1050 కిలోల తడిచెత్త వెలువడుతుండగా ఎండిపోయిన ఆకులు, ఆపుపేడతో ఎరువు తయారు చేస్తున్నారు.
వివిధ పద్ధతుల్లో ఏరోబిక్, వర్మీ కంపోస్ట్ విధానంతో ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతినెలా ఈ యార్డు ద్వారా సుమారు రూ. 7వేల వరకు ఆదాయం సమకూరుతున్నది. స్వచ్ఛబడి ఆవరణలోనే గోశాల వర్మీ కంపోస్టు యార్డు, హోమ్ కంపోస్టింగ్ యూనిట్, కమ్యూనిటీ కంపోస్ట్, విత్తన బ్యాంక్, గార్డెన్ నమూనా, జీరో వేస్ట్ హోమ్ తదితర వాటిని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛబడిని రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల పాలకవర్గాలు, అధికారుల బృందాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాఠశాలల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చూసి నేర్చుకుంటున్నారు. గతేడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఆంగ్ల పరీక్షలో స్వచ్ఛబడిపై ప్రశ్న వచ్చింది. ఈ రెండేండ్ల వ్యవధిలో సుమారుగా 10 వేల మంది వరకు స్వచ్ఛబడిని సందర్శించారు. సిద్దిపేట స్వచ్ఛబడి రాష్ర్టానికే ఒక రోల్ మోడల్గా నిలిచింది, షార్ట్ఫిల్మ్లు తీసుకుంటున్నారు. సందర్శనకు వచ్చే వారితో పాటు పట్టణంలోని వివిధ వర్గాల వారికి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి డిజిటల్ తరగతి గది ద్వారా బోధన చేస్తున్నారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీలో 45వేలకు పైగా జనావాసాలు, లక్షా యాభై వేలకు పైగా జనాభా ఉంది. మొత్తం 43 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల నుంచి ప్రతిరోజూ ఇంటింటా తడి పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి, హానికర చెత్తగా మూడు రకాలు విభజిస్తారు. వారంలో మంగళ, శుక్రవారం రోజుల్లో పొడి చెత్తను, మిగతా రోజుల్లో తడి చెత్తను ఇంటింటా సేకరిస్తున్నారు. ఇండ్ల నుంచి, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇలా ప్రతి దగ్గరి నుంచి రోజుకు 54.45 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో తడి చెత్త ఇండ్ల నుంచి 16 మెట్రిక్ టన్నులు కాగా, హోటళ్లు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు తదితర వాటి నుంచి 10.8 మెట్రిక్ టన్నులు, మొత్తంగా తడి చెత్త 26.8 మెట్రిక్ టన్నులు, పొడి చెత్త ఇండ్ల నుంచి 14 మెట్రిక్ టన్నులు, కమర్షియల్ నుంచి 2.5 మెట్రిక్ టన్నులు.. మొత్తం 16.5 మెట్రిక్ టన్నులు వస్తుంది. సిల్ట్ 6.85 మెట్రిక్ టన్నులు, బయో మెడికల్ వేస్ట్ చెత్త 1.4 మెట్రిక్ టన్నులు, హానికరమైన చెత్త 1.2, ఇతర వ్యర్థాలు 1.2 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రతిరోజూ సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన చెత్తను మున్సిపాలిటీలో నిర్మించిన వార్డు కంపోస్ట్ యార్డులకు తరలిస్తున్నారు. కాగా, 2021 డిసెంబర్లో బుస్సాపూర్లో బయోగ్యాస్ ప్లాంట్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. 2022 మార్చి నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమై, ఆరోజు నుంచి జూన్ 2023 వరకు సుమారుగా మున్సిపాలిటీ రూ. 35 లక్షల వరకు ఆదాయం సమకూర్చుకుంది. వర్మీకంపోస్ట్ ద్వారా ఎరువుల అమ్మకం ద్వారా రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరింది.
సిద్దిపేట స్వచ్ఛబడిలో ప్రత్యేక డిజిటల్ పాఠాలు చెబుతారు. ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా ఒక్కో క్లాస్కు 45 నిమిషాల పాటు బోధనను 39వ వార్డు కౌన్సిలర్ దీప్తినాగరాజు తరగతులు చెబుతారు. ఇంటి నుంచి చెత్త వెలువడే తీరు.. గాలి, నీరు మట్టి, కలుషితం అవుతున్న తీరు, ప్లాస్టిక్తో అనర్థాలు, పర్యావరణ రక్షణను కండ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. ఇండ్లలో సేంద్రియ ఎరువు తయారీ, చెత్తతో ఎరువు, స్టీల్ బ్యాంకుల ప్రాధాన్యం, తదితర ఇలా దాదాపు 24 అంశాలపై బోధన ఉంటుంది. రుతుప్రేమపై అవగాహన కల్పిస్తారు. పొడి చెత్తతో పునర్వినియోగ వస్తువుల తయారీ అంశాలను వివరిస్తారు. డిజిటల్ గదిలో 50 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వలంటీర్లు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, పట్టణ ప్రజలు ఇందులో భాగస్వాములవుతున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువు ఉత్పత్తే లక్ష్యంగా బడి ఆవరణలో 2020లో వార్డు స్థాయి కంపోస్టు యార్డును ఏర్పాటు చేశారు.
తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరుగా సేకరణపై ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్వయంగా వార్డులకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. సమయం దొరికిన సందర్భాల్లో వార్డుల్లో ఉదయమే తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీ నేతృత్వంలో పట్టణ కౌన్సిలర్లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్పీలు చెత్తబండితోనే వార్డులకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజల్లో మార్పు వచ్చింది. చెప్పితే వినని వారి ఇంటి ముందు ఆదే చెత్తను పోసి.. వారితోనే మూడు రకాలుగా చెత్తను వేరుచేయించి వారిలో మార్పు తీసుకువచ్చారు. ప్రస్తుతం సిద్దిపేట మున్సిపాలిటీలో చెత్తను మూడు రకాలుగా వేరు చేసి పట్టణ ప్రజలు చెత్త సేకరణ వాహనాలకు నిత్యం
అందిస్తున్నారు.
ప్రతిరోజూ ఇంటింటా సేకరించిన చెత్తను పునర్వినియోగించడం ఎలానో తెలిపేందుకు, దీని నుంచి సంపదను ఎలా పొందవచ్చో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదే స్వచ్ఛబడి. ఈ స్వచ్ఛబడిని 2వేల గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో వర్మీ కంపోస్టు యార్డు, పక్కనే పార్కు, డిజిటల్ తరగతి గది, వార్డు కంపోస్టు, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్ తదితర వాటిని ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట పెట్టారు, పనికి రాని వస్తువులతో చక్కగా పరికరాలను తయారుచేసి పెట్టారు. ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ వాల్ ఇలా ఎన్నో రకాలుగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. పాస్టిక్ చెత్తతో కలిగే అనర్థాలను తెలిపే బొమ్మలు వేశారు. ఈ స్వచ్ఛబడిలో చెత్తను మూడు రకాలుగా విభజిస్తారు. వీటిలో నుంచి హానికరమైన చెత్తను తీసివేసి మిగతా చెత్తను ముక్కలు ముక్కలుగా చేసి కంపోస్టు ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన వాటిలో వేస్తారు. అక్కడే ఒక గోశాలను ఏర్పాటు చేశారు. ఆవుల నుంచి వచ్చిన పేడను ఒక దగ్గర వేసి లిక్విడ్గా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన దానిని ఈ సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగిస్తున్నారు. సేంద్రియ ఎరువు తయారైన తర్వాత దానిని ఆర బెడతారు. ఆరబెట్టిన తర్వాత జల్లెడ పట్టి వచ్చిన దాన్ని ఒక దాంట్లో వేసి పెడతారు. జాలి పట్టగా మిగిలిన దానిని మరో దాంట్లో పోసి పెడతారు. ఇలా సేంద్రియ ఎరువు తయారయ్యాక ఇంటి పెరటి తోటలకు, మిద్దె తోటలకు ఇస్తారు. రైతులకు వ్యవసాయానికి ఈ ఎరువులను అందిస్తారు. ప్రతిరోజూ వార్డుల నుంచి ప్రజలను తీసుకువచ్చి అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ ఎరువు, కెమికల్ ఎరువుల ద్వారా పండిన కూరగాయలు ఎలా ఉన్నాయో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.డిజిటల్ తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. స్వచ్ఛబడి కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. ఈ స్వచ్ఛబడి ఇప్పుడు గూగుల్, ఇన్స్ట్రాగ్రాం, యూట్యూబ్ తదితర వాటిలో
వస్తున్నది.