‘నిమ్జ్’లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రధానంగా రవాణా వ్యవస్థపై దృష్టి పెట్టిన సర్కారు రహదారుల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేసింది. ఇందులోభాగంగా నేషనల్ హైవే 65 జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి చౌరస్తా నుంచి నిమ్జ్ వరకు 100 మీటర్ల వెడల్పుతో 9 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నది. ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేయగా పనులు చకచకా కొనసాగుతున్నాయి. జహీరాబాద్, ఝరాసంగం మండలాల్లో 229 మంది రైతుల నుంచి 65 ఎకరాల భూమిని సేకరించగా, ఇందులో 5 ఎకరాలకు సంబంధించి కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. మిగిలిన వారికి నష్టపరిహారంగా రూ.7.50 కోట్లు చెల్లించింది. ఈ రహదారి పూర్తైతే మరింత మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– జహీరాబాద్, మే 28
జహీరాబాద్, మే 16: జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) నిమ్జ్కు 65వ జాతీయ రహదారి నుంచి రోడ్డు నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి చౌరస్తా నుంచి నిమ్జ్కు వరకు 100 మీటర్ల వెడల్పుతో తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. దీనికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. దీని కోసం రెవెన్యూ అధికారులు జహీరాబాద్, ఝరాసంగం మండలాల్లోని హుగ్గెల్లి, రంజోల్, కృష్ణాపూర్, మాచునూర్, బర్టీపూర్ గ్రామాల్లో 65 ఎకరాలను సేకరించారు. ఇందులో 60 ఎకరాలకు సంబంధించి 229 మంది రైతులకు రూ.7.5 కోట్లు చెల్లించారు. మిగతా ఐదు ఎకరాలకు సంబంధించి రైతులు కోర్టుకు పోవడంతో పెడింగ్లో ఉంది. కోర్టు ఆదేశాలు రాగానే రైతులకు డబ్బులు చెల్లించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
నిమ్జ్కు 12,635 ఎకరాల భూసేకరణ
ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల్లో నిమ్జ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 7045 మంది రైతుల నుంచి 12,635 ఎకరాల భూమిని సేకరిస్తున్నది. ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్లో 319.05 ఎకరాలు, ఎల్గొయిలో 1,838.32 ఎకరాలు, చీలేపల్లి 585.04 ఎకరాలు, న్యాల్కల్ మండలం రూక్మాపూర్లో 313.10 ఎకరాలు, ముంగి 445.22 ఎకరాలు, గణేశ్పూర్ 597.39, హుసెల్లి 731.29ఎకరాలు, గుంజెట్టి 291.33 ఎకరాలు, హద్నూర్ 577.29 ఎకరాలు, న్యాతాబాద్ 1,221.10 ఎకరాలు, మామిడ్గి 1,487 ఎకరాలు, కల్బేమాల్ 415.16 ఎకరాలు, బసంత్పూర్ 248.11 ఎకరాలు, మెంటల్కుంట 658.27 ఎకరాలు, గంగ్వార్ 38.17 ఎకరాలు, రేజింతల్ 1,734.34 ఎకరాలు, మాల్కాన్పహడ్లో 216.05 ఎకరాలు సేకరిస్తున్నారు. ఎకరానికి రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నారు.
2.66 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
నిమ్జ్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.66 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రామలు యూనిట్లు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.
హుగ్గెల్లి చౌరస్తా నుంచి బర్ధీపూర్ వరకు
65వ జాతీయ రహదారి హుగ్గెల్లి చౌరస్తా నుంచి నిమ్జ్కు ప్రత్యేక రహదారిని నిర్మిస్తున్నారు. ఎక్కడా సర్వీస్ రోడ్లు లేవు. 65వ జాతీయ రహదారి నుంచి నేరుగా బర్ధిపూర్ శివారులోని నిమ్జ్ ప్రాంతానికి చేరుకొనేందుకు వంద మీటర్లుతో నిర్మిస్తున్నారు. మధ్యలో నారింజ వాగు, కృష్ణాపూర్ రోడ్డు, ఝరాసంగం-జహీరాబాద్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనాలు సిద్ధం చేశారు. మాచునూర్, బర్ధీపూర్ గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు మ్యాప్ రూపొందించారు. నిమ్జ్లో ఉత్పత్తి చేసే పరికరాలను భారీ వాహనాల్లో వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు.