మద్దూరు(ధూళిమిట్ట), జూలై 14: వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచిత విద్యుత్ను అందిస్తుండడంతో రైతులు వరిసాగుపై మక్కువ చూపుతున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. నాటు వేసే విధానంలో వరిని సాగుచేస్తుండడంతో కూలీల కొరత ఏర్పడుతుంది. కూలీల సమస్యను అధిగమించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి సైతం కూలీలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి కూలీలు పెద్దఎత్తున వచ్చి గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. దీనివల్ల కూలీల రేట్లు అమాంతం పెరిగాయి. పెరిగిన కూలీరేట్లు రైతులకు భారం గా మారాయి. ఉమ్మడి మద్దూరు మండలపరిధిలో ఈ ఏడాది వానకాలంలో 12,366 ఎకరాల్లో వరి పంటను సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.
వెదజల్లే విధానంతో రైతులకు మేలు
రైతులు ఇప్పటివరకు నారుమడిని పెంచి, పొలంలో నాట్లు వేస్తూ వస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల సాగునీరు సరైన సమయంలో అందక, వ్యవసాయ కూలీల కొరత, నారు పెంచి నాటువేసేందుకు అధిక రేట్లు, ఇతర పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావడం వల్ల సాగు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ క్రమంలో విత్తనాలు వెదజల్లే పద్ధతి సులువైన మార్గమని, అధిక దిగుబడిని పొందవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈవిధానంలో ‘నారు పోసే పనిలేదు, నాటు పెట్టే పనిలేదు. కూలీల గొడవ లేదు. నాట్లు వేసే పద్ధతిలో ఎకరాకు 25 నుంచి 30కిలోల విత్తనాలు అవసరమవగా, వెదజల్లే పద్ధతిలో 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇక నాటే ముందు కేజ్వీల్తో దున్నే ఖర్చు, నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు మిగిలిపోతుంది. దీంతో ఈ విధానంలో ఎకరాకు రూ. 6వేల నుంచి రూ. 8వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కూలీల సమస్య లేకుండానే సమయానుకూలంగా ఈ విధానంలో వరి సాగు చేపట్టవచ్చు.వెదజల్లే విధానంలో10 రోజుల ముందుగానే పంట చేతికొస్తుంది. రెండో పంటను వేసుకునేందుకు కూడా అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ విధానంలో 25 నుంచి 30శాతం వరకు నీటి వాడకం తగ్గుతుంది. ప్రధానంగా వెదజల్లే విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీనికనుగుణంగా వెదజల్లే పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది.
నాటు వేసే యంత్రాలకు గిరాకీ..
వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడడంతో రైతులు ప్రత్యామ్నాయ సాగు విధానాల వైపు చూస్తున్నారు. వరి నాటు యంత్రాల వినియోగంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. దీంతో నాటు వేసే యంత్రాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఈ యంత్రాల్లో రెండు రకాలున్నాయి. అందులో మనిషి కూర్చోని నడిపే యంత్రం కాగా మరొకటి నడుస్తూ నడిపే యంత్రం. ఈ నాటు వేసే యంత్రాలను వినియోగించే రైతులు ముందుగా నారును ట్రేలల్లో పెంచాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో 16 రోజులలోనే వరి నాటేందుకు నారు సిద్ధంగా ఉంటుంది. ఎకరానికి 60 నుంచి 80 ట్రేల నారు అవసరం ఉంటుంది. ట్రేలల్లో పెంచేందుకు ఎకరానికి 12 నుంచి 15కిలోల విత్తనం కావాలి. అదే సాధారణ పద్ధతిలో అయితే 25-30 కిలోలు అవసరమవుతుంది. ఈ యంత్రం సాయంతో దాదాపు 4నుంచి 5 ఎకరాల్లో నాటవచ్చు. సాధారణ పద్ధతిలో 30-35 రోజుల దశలో ఉన్న నారును నాటడం వల్ల దుబ్బులో పిలకల సంఖ్య తక్కువగా ఉంటుంది. యంత్రం పద్ధతిలో 14-16 రోజుల నారును నాటడం వల్ల పిలకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఎకరాలో నాటేందుకు రోజుకు 8-10 మంది కూలీలు అవసరం. కానీ యంత్రంతో ఎకరాలో నాట్లను సుమారు రెండుగంటల్లో పూర్తి చేయవచ్చు. యం త్రంతో నాటినప్పుడు సాళ్లమధ్య మొక్కల మధ్య ఎడం తగినంతగా ఉండడం వల్ల మొక్కల సాంద్రత బాగుంటుంది. దీంతో చీడపీడల సమస్య తగ్గుతుంది. ఈ వరినాటు వేసే యంత్రానికి ఎకరానికి రూ.5వేల వ్యయం అవుతుంది. అదే సాధారణ పద్ధతిలో అయితే ఎకరాకు రూ. 8వేల ఖర్చు అవుతుంది. వరినాటు వేసే యంత్రాల వల్ల లాభాలు ఉండడంతో రైతులు నాటు యం త్రాల వినియోగంపై దృష్టి సారిస్తున్నారు.
సాగు ఖర్చు తగ్గుతుంది..
వెదజల్లె విధానం, డ్రమ్సీడర్ సాయంతో వరినాట్లు వేసుకోవడం వల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గుతాయి. అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువగా వస్తాయి. కూలీల కొరత వల్ల రైతులు వరినాట్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రైతులు వరినాటు విధానానికి స్వస్తి పలకాలి. వెదజల్లే విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఉమ్మడి మద్దూ రు మండలంలో సుమారు వెయ్యి ఎకరాలకుపైగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. వెదజల్లే పద్ధతిపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం.
– బూరెల రామకృష్ణ, ఏవో, మద్దూరు
డ్రమ్సీడర్తో ఐదెకరాలు సాగు
వరి నాట్లకు కూలీలు దొరకకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నం. ఒక్కొక్కరికీ రూ. 500 ఇచ్చినా దొరకడం లేదు. దీంతో ఎవుసం ఎట్ల చేయాలె అని బాధపడుతుండేవాణ్ణి. నిరుడు పక్క పొలం రైతు డ్రమ్సీడర్ సాయంతో వరిని సాగు చేసిండు పంట మంచిగా వచ్చింది. దీంతో ఈ వానకాలంలో నేను కూడా ఇదే పద్ధతిలో సాగు చేయాలని భావించి, ఐదు ఎకరాల్లో డ్రమ్సీడర్ సా యంతో విత్తనాలు వేశాను.
– గొడుగు బాలరాజు, రైతు, గాగిళ్లాపూర్
వరి నాటు మిషన్కి గిరాకీ బాగానే ఉంది
రైతులకు కూలీలు దొరకకపోవడంతో మిషన్లకు గిరాకీ బాగానే ఉంది. నాకు మూడు నా టు వేసే మిషన్లు ఉన్నాయి. ఈ ఏడాది వానకాలంలో 800 ఎకరాలకు డిమాండ్ ఉంది. వారినాట్ల మిషన్కు ఎకరానికి రూ. 5వేలు ఖర్చు అవుతుంది. రైతుకు ఈ మిషన్ సాయంతో నాట్లు వేసుకుంటే ఎకరానికి రూ.3వేల వరకు ఆదా అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ మిషన్లతోనే రైతులు నాట్లు వేసే అవకాశం ఉంది.
– వేణుగోపాల్రెడ్డి, నాటుయంత్రం యజమాని, లద్నూర్