సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 11: రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించే క్రమంలో నిబంధనలను పాటించని వివిధ ప్రైవేటు దవాఖానలకు వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవి ఆదేశాలతో మంగళవారం సంగారెడ్డిలోని 20 ప్రైవేటు దవాఖానలు, వైద్య సంస్థలను వైద్యా అధికారుల బృందాలు విస్తృత తనిఖీలు చేశాయి.
నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని మూడు దవాఖానలకు వివిధ కారణాలతో నోటీసులు జారీ చేశారు. పోతిరెడ్డిపల్లిలోని మెహర్ ఫిజియోథెరపీ క్లినిక్ రెన్యూవల్ చేసుకోకుండా నిర్వహిస్తున్నట్టు గుర్తించడంతో మూసిశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి హెచ్చరించారు.