చేర్యాల, డిసెంబర్ 12 : మొన్నటి వరకు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి డబ్బులు జమ చేయడం లేదా డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది. దీంతో విలువైన సమయాన్ని ప్రజలు గంటల కొద్ది బ్యాంకుల్లోనే గడిపేవారు. ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకుంటుండడంతో బ్యాంకులు సైతం అందుకు అనుమతి ఇస్తుండడంతో ప్రస్తుతం లావాదేవీలు ప్రజలకు ఈజీ అయిపోయాయి. డిజిటల్ టెక్నాలజీతో ఇంటి నుంచే బ్యాంకు సేవలను రాత్రి, పగలు తేడా లేకుండా వినియోగంచుకుంటున్నారు. ప్రజలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాగా, బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు కలిగింది.
దీంతో బ్యాంకులు తమ యాప్ల ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం మొదలు పెట్టాయి. అలాగే ప్రైవేటు సెక్టార్లు ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ లావాదేవీలు నిర్వహించే ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు డబ్బులు చెల్లించాలంటే గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రయాణించి విలువైన సమయం వెచ్చించేవారు. ఇప్పుడు అలాంటి వ్యయప్రయాసలు లేకుండా క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. దీంతో మానవుని విలువైన సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు మిగులుతున్నాయి.
ఆరు మార్గాల ద్వారా లావాదేవీలు
బ్యాంకులు ఆరు మార్గాల ద్వారా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. మొదటిది బీమా/యూపీఐ, బ్యాంకు యాప్లతో పాటు ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా ఒకరి అకౌంట్ నుంచి మరొకరి అకౌంట్కు డబ్బులు పంపవచ్చు. రెండో బీమా/ఆధార్ నెంబర్స్, వేలి ముద్ర ద్వారా వినియోగదారులు సేవా కేంద్రాల్లో డబ్బు తీసుకోవచ్చు. మూడోది భారత్ క్యూఆర్ కోడ్ ఫోన్పే, గూగుల్పే, వాటితో బ్యాంకు క్యూఆర్ కోడ్లను ఫోన్తో స్కాన్ చేయడం ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. ఈ పద్ధతి ప్రతి దుకాణాల్లో కనబడుతున్నది. నాల్గోది ఐఎంపీఎస్ ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యాఫ్ల ద్వారా మొబైల్ నంబర్తో డిజిటల్ లావాదేవీలు నిర్వహించవచ్చు. అయితే డబ్బు పంపించే వ్యక్తితో పాటు తీసుకునే వ్యక్తికి ఫోన్పే తదితర డిజిటల్ యాప్లు ఉండాల్సి ఉంటుంది. ఐదోది డెబిట్(ఏటీఎం కార్డు), క్రెడిట్ కార్డులను స్వైప్మిషన్ ద్వారా సైతం నగదురహిత ట్రాన్జక్షన్స్ నిర్వహించవచ్చు. ఆరోది యూఎస్ఎస్డీ పద్ధతిలో ఎస్ఎంఎస్ ద్వారా సైతం నగదురహిత లావాదేవీలు చేయొచ్చు. అయితే ఈ పద్ధతిని ప్రస్తుతం ప్రజలు ఆదరించడం లేదు.
ప్రజలకు సేవలు.. యాప్ సంస్థలకు కమీషన్
ఫోన్పే, గూగుల్ పే వంటి సంస్థలు స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ఆయా బ్యాంకులు పేమెంట్ సంస్థలకు కమీషన్ చెల్లిస్తుంటాయి. బ్యాంకులు సైతం యాప్ల ద్వారా నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అయితే బ్యాంకు యాప్ల ద్వారా రోజుకు రూ.2లక్షల మేరకు డిజిటిల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే బ్యాంకులు ఆ సమస్యను పరిష్కరిస్తాయి. ఒక ఫోన్పే, గూగుల్పే వంటి పేమెంట్ సంస్థల ద్వారా ఒక రోజులో రూ.లక్ష వరకు లావాదేవీలు జరుపొచ్చు. వీటి ద్వారా ఏదైనా ఇబ్బంది అయితే ఆ సంస్థలే పరిష్కరించాల్సి ఉంటుంది. చేర్యాలలో 6 బ్యాంకులు, కొమురవెల్లిలో 1, ధూళిమిట్టలో 1 జాతీయ బ్యాంకులతో పాటు మద్దూరు మండలంలో ప్రైవేటు బ్యాంకులతో పాటు వివిధ గ్రామాల్లో సర్వీస్ పాయింట్ల వద్ద సైతం నగదు రహిత లావాదేవీలు కొనసాగుతున్నాయి.