నిజాంపేట్, డిసెంబర్ 1:పైర్లకు వేపపూత యూ రియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నాయి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరియా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూత యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
వేపచెట్టు రైతు నేస్తం. వేపగింజలు, ఆకులు, నూనె, బెరడు, వేర్లు ఇలా ప్రతి భాగం ఉపయోగమే. ఇలాంటి లక్షణాలతో వేప వృక్ష సంబంధిత క్రిమిసంహారిణిగా పేరు పొందింది. వేపగింజల్లో నూనె అధికశాతం ఉండడంతో వేప విలువ మరింత పెరిగింది.
పంటకు 80శాతం నత్రజని పోషకాన్ని యూరియా రూపంలోనే అందిస్తారు. యూరియాలో నత్రజనితోపాటు 20శాతం కర్బనం, 26శాతం ఆక్సిజన్, 6 శాతం హైడ్రోజన్ మూలకాలు ఉంటాయి. సాధారణ యూరియాతో నత్రజని పోషకాన్ని పూర్తిగా ఉపయోగించుకోక వృధాగా భూమిలోకి పోతుంది. కానీ వేపపూత యూరియా మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తుంది. రెండు విలువైన ప్రక్రియల సమ్మేళన ఫలితంగా వేపపూత యూరియా తయారవుతుంది. గాలి, సహజ వాయువుల ఆధారంగా యూరియా తయారీ మొదటి అంశం, ఆ తర్వాత సన్న యూరియా తయారీ చివరిదశలో ఒకేలా వేపనూనెను పూతగా పట్టించడం రెండో అంశం. వేపనూనెను యూరియా మీద ఒకపొర మాదిరిగా ఏర్పాటుచేయడంతో రైతులకు పలువిధాలుగా లాభాలున్నాయి.
సాధారణంగా యూరియా తేమను గ్రహించి బస్తాలో కొంతమేర గడ్డ కడుతుంది. వేపపూత యూరియాలో వేపనూనె యూరియా గుళికలపై పొరలా ఏర్పడుతుంది. దీంతో యూరియా తేమను త్వరగా గ్రహించలేదు.
సాధారణ యూరియా నీటిలో త్వరగా, సులభంగా కరిగిపోతుంది. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు యూరియాలో అధికశాతం నత్రజని మొక్కలకు అందకుండా నేల లోపలి పొరల్లోకి చేరుతుంది. వేపపూత యూరియా వాడినప్పుడు ఈ సమస్య తగ్గుతుంది.
సాధారణ యూరియాకు సూర్యరశ్మి, గాలి తగిలినప్పుడు ఆవిరవుతుంది. వేపపూత యూరియాలో ఈ సమస్య ఉండదు.
వేపపూత యూరియా ద్వారా విడుదలయ్యే నత్రజని పోషకం నెమ్మదిగా మొక్కలకు అందుతుంది. దీంతో వృధాశాతం తగ్గుతుంది.
వినియోగ సామర్థ్యం 10-15 శాతం అధికమై 5-10శాతం దిగుబడులు పెరుగుతాయి.
పనితీరు..
సాధారణ యూరియాలో నత్రజని అమోనియా రూపంలో ఉంటుంది.
యూరియాను పొలాలకు వేసినప్పుడు… భూమిలో ఉండే నైట్రిఫయింగ్ బ్యాక్టీరియా అమోనియా రూపంలో ఉన్న నత్రజనిని నైట్రేట్ రూపంలోకి మారుస్తుంది. దీంతో అది మొక్క వేరు వ్యవస్థకు అందకుండా నేల పొరల్లోకి వెళ్లి వృధా అవుతుంది. వేపపూత యూరియా వాడినప్పుడు, ఈ బ్యాక్టీరియా ప్రభావం తగ్గి నత్రజని వృధా కాదు.
పంట అవసరాలకు అనుగుణంగా రెండుసార్లు వేపపూత యూరియా వేయాలి.
భూమిలో సరైన తేమ ఉన్నప్పుడే యూరియా వేయాలి.
వరిలాంటి పంటలకు నీటిని తీసివేసి యూరియా వేయాలి. పంటకు మరుసటి రోజు నీరు పెట్టాలి.
తేలిక పొలాల్లో తేలికపాటి తడిచ్చి వేపపూత యూరియా వేయాలి.
బరువు నేలలో తడిచ్చే ముందు ఎరువు వేస్తే సరిపోతుంది.
సాయంత్రం వేళల్లోనూ, డ్రిప్ద్వారా వేపపూత యూరియా వేస్తే నత్రజని శాతం బాగా తగ్గుతుంది. నత్రజని ధాతువు లోపించినా, నీటి సరఫరా తగినంత లేకపోయినా, పంటకు ఎండబెటకు గురైనా వేపపూత యూరియాను పంటమీద పిచికారీ చేస్తే తప్పక ప్రయోజనం చేకూరుతుంది.