నర్సాపూర్, నవంబర్5: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, చేయాల్సింది కూడా ఏమి లేదని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగులపల్లి, మూసాపేట్, పెద్దచింతకుంట, చిన్నచింతకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్ విజయానికి తోడ్పడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతు రుణమాఫీని ఆపారని, కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేఖ పార్టీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకులను పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని, బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ఒత్తిడి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుంటే బీజేపీ మాత్రం మీటర్లు పెట్టాలని భావిస్తుందని ఎవరికి ఓటు వేయాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో రోడ్లు వేశామని, గెలిపిస్తే ఇంకా వేస్తామని వెల్లడించారు. నాగులపల్లిలో కాళేశ్వరం కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇండ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కులం, మతం, వర్గం పేరు చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందాయని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ అని చెప్పుకుంటున్నాడు, వారి కుటుంబ సభ్యులు మాత్రం రెడ్డిలు అని చెప్పుకుంటున్నారు, ఇదెక్కడి చోద్యం అని విమర్శించారు. యాదవ సోదరులకు గొర్రెలను పంపిణీ చేశామని ఇతర పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. బీజేపీ అభ్యర్థి మురళీయాదవ్కు జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పదవులను ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించాడని నేడు కులం పేరుతో ఓట్లు అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో 5 గంటల మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఓటు ఎవరికి వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని, కాంట్రాక్టర్లు ముందుకు రాకా పనులు ఆగిపోయాయని అధికారంలోకి రాగానే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో సునితాలక్ష్మారెడ్డిని గెలిపించి గ్రామాలను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, దళితబంధు, బీసీబంధు పథకాలను అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ అందిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవెందర్రెడ్డి, సర్పంచులు లావణ్యరవి, సేనాధిపతి, శివకుమార్, సురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ వెంకటనర్సిగరావు, ఎంపీటీసీ మేఘమాలకిషన్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.