సదాశివపేట, అక్టోబర్ 20: మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. రాష్ట్రమంతా ఒకే నెంబర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించే అవకాశం కల్పించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆస్తిపన్ను చెల్లించాలంటే కార్యాలయానికి వెళ్లడమో, బిల్ కలెక్టర్ ఇంటికి వస్తే నగదు చెల్లించడమో జరిగేది. ప్రస్తుతం, అన్ని శాఖల్లో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. పురపాలక శాఖ సైతం ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చి ఆన్లైన్ సేవా కేంద్రాలు, మీ సేవా కేంద్రాలకు వెళ్లి పన్ను చెల్లించుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. వాట్సాప్ వినియోగించి ఎవరికి వారే ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నది. నూతన విధానంతో ఇంటి యజమానులు ఎక్కడ ఉన్నా నేరుగా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించవచ్చు. ఈ సరికొత్త విధానంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. కాగా, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్-జోగిపేట, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ప్రజలు వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించవచ్చు.
నూతన వాట్సాప్ విధానం ఇలా..
మొదట స్మార్ట్ ఫోన్లో పురపాలక శాఖ వాట్సాప్ నెంబర్ 9000253342 నెంబర్ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా హాయ్ అనే మెసేజ్ పంపితే రాష్ట్ర పురపాలక శాఖ నుంచి సమాచారం వస్తుంది. భాషను ఎంచుకునేందుకు అడిగినప్పుడు తెలుగు కోసం ఏ అని టైప్ చేయాలి. అందులో పది రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల వివరాలు వస్తాయి. మన మున్సిపాలిటీ పేరుకు ఉన్న క్రమసంఖ్యను ఎంపిక చేసుకుని సందేశం పంపాలి. పన్ను వివరాలు తెలుసుకునేందుకు రెండు ఆప్షన్లు వస్తాయి. మొదట ఆస్తిపన్ను సంఖ్య రెండోది ఇంటి నెంబరులో ఏదేని ఒకటి ఎంచుకుని నమోదు చేయాలి. వెంటనే పన్ను వివరాలు వస్తాయి. ఇంటి యజమాని పేరు, పన్ను బకాయిలు తదితర వివరాలు సరి చూసుకుని పన్ను చెల్లించేందుకు పేమెంట్ ఆప్షన్ ఎంచుకోగానే నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఏదైనా ఒక దానిని ఎంచుకుని ఆస్తిపన్నును చెల్లించవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి…
మున్సిపాలిటీలో ఉన్న నివాసాలు, ఇతర వ్యాపార, అన్నిరకాల భవనాలను భువన్ యాప్లో నమోదు చేశాం. ఎవరు ఎంత పన్ను చెల్లించాలనే వివరాలు ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. నూతనంగా వచ్చిన వాట్సాప్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వాట్సాప్ కొత్త విధానంపై ప్రజలకు మరితం అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
– కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, సదాశివపేట
సాంకేతిక సమస్యలపరిష్కారం కోసం..
పన్నులు చెల్లించే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే బాధితులు 040-23120410 నెంబర్కు ఫోన్ చేస్తే అక్కడ సిబ్బంది పరిష్కరిస్తారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ప్రజలు ఈ విధానాన్ని వినియోగించి పన్నులు చెల్లించే అవకాశం కల్పించారు. నూతన పన్ను వసూలు వాట్సాప్ విధానంపై అధికారులు పుర ప్రజలకు వీలైనంత అవగాహన కల్పించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉన్నది. పట్టణాలకు దూర ప్రాంతాల్లో ఉండే ఇంటి యజమానులు ఈ నూతన విధానంతో సురక్షితంగా, వేగంగా తమ ఆస్తి పన్ను కట్టేయొచ్చు.