కంది, ఫిబ్రవరి 19: టెక్నాలజీ వాణిజ్యకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ వేదికైంది. మూడు రోజులు కొనసాగే ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్ 2026 జాతీయ వేదిక గురువారం ప్రారంభమైంది. ఐఐటీహెచ్ డైరెక్టర్ మూర్తి, ఐఈడీఎస్ జాయింట్ డైరెక్టర్ సీఎస్ఎస్ రావు, రాయల్ డానిష్ రాయబార కార్యాలయ కౌన్సిలర్ డాక్టర్ లూయిస్ బోయిసెన్ ముఖ్య అతిథులు హాజరై టెక్ కనెక్ట్ను ప్రారంభించారు. భవిష్యత్ తరానికి ఉపయోగపడేలా తయారు చేసిన ఏఐ టెక్నాలజీ పరికరాలు, పరిశోధన నైపుణ్యాన్ని పరిశ్రమల భాగస్వామ్యంతో మార్కెటింగ్ చేయడం తదితర అంశాలపై ముఖ్య అతిథులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా సుమారు వందకు పైగా టెక్నాలజీ ఎగ్గిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో అగ్రిటెక్, హెల్త్ టెక్, రోబోటెక్స్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ అండ్ క్టీన్ టెక్ మెటీరియల్స్, స్మార్ట్ సిటీస్, ఎడ్ టెక్, పరిశ్రమలకు చెందిన ఆవిష్కరణలు ప్రదర్శించారు.
గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి
సోలార్ ద్వారానే కాకుండా గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్మిల్ను స్టాల్స్లో ప్రదర్శించారు. విండ్స్ట్రీం కంపెనీ దీనికి రూపకల్పన చేసి 35దేశాల్లో అమలవుతున్న ఈ విండ్మిల్ ఆకర్శణగా నిలిచింది. సూర్యరశ్మి ఉంటేనే సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీనికి అలా కాకుండా గాలి ఉన్నంత వరకు ఈ విండ్మిల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సముద్రంలో ప్రయాణించే బోట్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, టెలికామ్ టవర్లలో విండ్విల్ను వినియోగించవచ్చు. విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుంది. చర్లపల్లిలో విండ్విల్ పరిశ్రమ, గచ్చిబౌలి హైదరాబాద్లో దీని కార్యాలయం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వ్యర్థ పదార్థాలతో హైడ్రోజన్ గ్యాస్
వ్యర్థ పదార్థాలతో హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తి చేసే విధానాన్ని చూపుతూ ఏర్పాటు చేసిన స్టాల్ ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బయో హైడ్రోజన్ ప్రొడక్షన్ పేరుతో సీఎస్టీఆర్ నాచారం, మౌలాలిలో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పెట్రోల్తో 15 కిలోమీటర్ల వరకు నడిచే వాహనాలు హైడ్రోజన్ గ్యాస్తో 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 500కిలో వేస్టేజ్ ఫుడ్తో 5వేల లీటర్ల హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుందని నిర్వాహకులు తెలిపారు. గ్యాస్తో పాటు సీఎన్జీకి అవసరమయ్యే నితన్, బయో డీజిల్, అల్గెపౌడర్ తదితర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.