రైతుబంధు, ఆసరా పింఛన్ల డబ్బులను కొన్ని బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని, రైతులు, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి కలెక్టర్ రాజర్షి షాకు సూచించారు. కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరై వ్యవసాయం, విద్యుత్తు, విద్య, ఆరోగ్యం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, డీఆర్డీవో శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 121 కుటుంబాలకు రైతుబీమా డబ్బులు అకౌంట్లో జమకాలేదని, వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో 83 శాతం ప్రసవాలు చేసి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన వైద్యులను కలెక్టర్ రాజర్షి షా ప్రశంసించారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జడ్పీచైర్పర్సన్ ఆదేశించారు.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 14: రైతుబంధు, ఆసరా పింఛన్ల డబ్బులను బకాయిల కింద కొన్ని బ్యాంకులు జమ చేసుకోవడం ద్వారా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి ఇబ్బందులు కలుగకుండా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మెదక్ కలెక్టర్ రాజర్షి షాను విజ్ఞప్తి చేశారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్య, మిషన్ భగీరత, పంచాయతీరాజ్, డీఆర్డీవో శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు రైతుబీమా, రైతుబంధు సమస్యలు లేవనెత్తారు.
ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి స్పందిస్తూ జిల్లాలో కొందరు రైతులకు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడలేదని, రైతుబీమాకు సంబంధించి పెండింగ్లో ఉన్న 121 కుటుంబ సభ్యులకు డబ్బులు అందేలా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశా కుమారికి సూచించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని వ్యవసాయాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమిస్తే వారు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదన్నారు. రైతుబీమా, రైతుబంధు విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. జిల్లా వ్యవసాధికారి ఆశాకుమారి మాట్లాడుతూ జిల్లాలో 121 మందికి చెందిన రైతు బీమా డబ్బులు ఎల్ఐసీ వద్ద పెండింగ్లో ఉన్నాయని, తూప్రాన్లో ఐఎఫ్ఎస్సీ కోడ్ సమస్య వల్ల పెండింగ్లో ఉన్నాయని త్వరలో సమస్య పరిష్కారం కానుందన్నారు.
ఇన్ఫెక్షన్లు రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా కేంద్రంలోని మాతా శిశుసంరక్షణ కేంద్రంలో సిజేరియన్ ద్వారా కాన్పులైన వారికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని, రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో చందూనాయక్కు ఎమ్మెల్సీ సూచించారు. రోగుల వెంట వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో బిల్లులు అధికంగా వసూలుకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో ద్వారా ఇప్పటి వరకు 2,12,622 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 22,876 మందికి రీడింగ్ అద్దాలు, 11,606 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేశామని డీఎంహెచ్వో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 83శాతం ప్రసవాలు చేసి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిచిన వైద్యులను కలెక్టర్ ప్రశంసించారు. 90 శాతం లక్ష్యసాధన కోసం కృషి చేయాలన్నారు.
జనారణ్యంలోకి కోతులు రాకుండా చూడాలి
జిల్లాలో కోతులు, కుక్కల బెడద అధికంగా ఉందని, నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఎక్కడో పట్టిన కోతులను వదిలి పెడుతున్నారని, దీంతో నర్సాపూర్లో కోతుల బెడద అధికమైందన్నారు. జనారణ్యంలోకి కోతులు తీసుకురాకుండా అటవీ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నిజాంపేట మండలంలో పంటల సాగుకు రైతులు పూర్తిగా బోర్లపై ఆధారపడ్డారని, బోర్ కనెక్షన్ల కోసం పెండింగ్లోని దరఖాస్తులపై ప్రత్యేక డ్రైవ్ పెట్టి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ ట్రాన్స్కో ఎస్ఈకి సూచించారు. రామాయంపేట పట్టణ మొత్తానికి ఒకే ఫీడర్ ఉండటంతో విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయని, మరో ఫీడర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. ఇండ్లపై నుంచి వెళ్లే విద్యుత్ తీగలు, వంగిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెల ఏర్పాటు వంటి సమస్యలు పరిష్కారించాలన్నారు. వేసవి దృష్యా తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్సీ మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.
‘మనఊరు-మనబడి’ పనులకు చొరవ చూపాలి
‘మనఊరు-మనబడి’ ద్వారా రూ.కోటి లోపు పనులకు టెండర్లు రానట్లయితే ఎస్ఎంసీ కమిటీ తీర్మానం ద్వారా నామినేషన్ పద్ధతిలో పనులు చేయడానికి చొరవ చూపాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ తెలిపారు. నిధులకు కొరత లేదన్నారు. జిల్లాలో వివిధ కారణాలతో తిరస్కరణలకు గురైన పింఛన్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే మంజూరవుతాయని డీఆర్డీవో శ్రీనివాస్ తెలియజేశారు. ఉపాధి హామీ పథకం కింద 1,76,109 జాబ్ కార్డు దారులకు పనులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు పరిష్కారించాలని జడ్పీ చైర్పర్సన్ హేమలత అధికారులకు సూచించారు. అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని నిజాంపేట జడ్పీటీసీ విజయ్కుమార్తో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు సభ దృష్టికి తీసుకురాగా, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సమావేశాలను బహిష్కరిస్తామన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని తప్పకుండా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలన్నారు. కృషియల్ బ్యాలెన్స్ ఫండ్ నుంచి కొత్త మండలాలకు ఫర్నిచర్ తదితర సామగ్రి కోసం నిధులు మంజూరైనట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ సీఈవో శైలేశ్ వెంకట్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, జడ్పీటీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.