మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 17: జిల్లాలోని పోడు భూములకు సంబంధించి సర్వే చాలా చోట్ల పెండింగ్లో ఉన్నాయని, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంలోని భూముల సమస్య పరిష్కారించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అధ్యక్షతన జరిగిన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో వైద్యారోగ్యం, విద్యాశాఖ, ఆసరా పింఛన్లు, విద్యుత్, రహదారులు, భవనాలు, మిషన భగీరథ శాఖల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ తొక పాసు పుస్తకాలు 70 ఏండ్ల నుంచి కాస్తులో ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు ట్రెంచ్ను దాటి కాస్తులో ఉన్న భూమి అటవీ పరిధిలో కలుపుకొంటున్నారని, తద్వారా చాలా మంది రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.
పోడు భూములకు సంబంధించి 62 గ్రామ పంచాయతీల పరిధిల్లోనే కాకుండా ఎన్నో అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిశీలించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. జిల్లా అటవీశాఖాధికారి సమావేశానికి గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పంచాయతీరాజ్ రహదారుల బీటీ రెన్యువల్, వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జీల మరమ్మతులు, గిరిజన తండాల్లో రోడ్లకు, ఆర్అండ్బీ రోడ్లకు భారీగా నిధులు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్కు, పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్న బల్క్ వాటర్ను పెంచాలని భగీరథ అధికారులను ఆదేశించారు. రూర్బన్ పథకం కింద పాపన్నపేట మండలంలో చేపట్టిన పనులకు సంబంధించి వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. సదరం క్యాంపులో వికలాంగత్వం ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదని, కార్డు వచ్చి పింఛన్ రాని వారి జాబితా, కొత్త పింఛన్ల జాబితా అందజేస్తే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని డీఆర్డీవో శ్రీనివాస్కు సూచించారు. విద్యుత్ శాఖను సమీక్షిస్తూ జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు 6 ఏర్పాటు చేశామని, 6,526 వ్యవసాయ బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, మిగిలి 1,149 కనెక్షన్లు త్వరలో ఇవ్వనున్నామని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద 9 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 309 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే వివరాలు అందజేస్తే మంజూరు చేయిస్తాని ఎమ్మెల్యే ఎస్ఈకి సూచించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద రెండు కోళ్ల ఫారాల యూనిట్లకు విద్యుత్ సౌకర్యానికి రూ.లక్ష 93 వేల చొప్పున లబ్ధిదారులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారని, మినహాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఎస్ఈకి సూచించారు.
మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తాం..
‘మనఊరు-మనబడి’ మొదటి దశలో పనులకు సంబంధించి ఎంబీ రికార్డు అయిన వెంటనే డబ్బులు చెల్లిస్తున్నామని నిధులకు కొరత లేదని జిల్లా విద్యాధికారి రమేశ్ పేర్కొన్నారు. కొన్ని పాఠశాలలో ప్రాధాన్యతను బట్టి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పిస్తే జిల్లాపరిషత్ నుంచి నిధులు సమకూరుస్తామని డీఈవోకు జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ సూచించారు. వైద్యఆరోగ్య శాఖను సమీక్షిస్తూ జిల్లాకు 57 పల్లె దవాఖానలు, ఒక బస్తీ దవాఖాన మంజూరయ్యాయి. త్వరలో జిల్లాకు 34 మంది రెగ్యులర్ డాక్టర్లతో పాటు స్టాప్ నర్సులు వస్తున్నారని జిల్లా వైద్యాధికారి చందునాయక్ తెలిపారు. వచ్చే జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, జిల్లాలో 40 బృందాలను ఏర్పాటు చేసిన తగు శిక్షణ ఇవ్వడంతో పాటు అద్దాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మాత శిశుసంరక్షణ కేంద్రంలో గత నెలలో రికార్డు స్థాయిలో 407 కాన్పులు చేయగా, ఇందులో 62 సాధారణ కాన్పులు చేయడంపై వైద్యులను పద్మాదేవేందర్రెడ్డి ప్రశంసించారు. పీహెచ్సీల్లో 24 గంటల వైద్య సేవలు అందించాలని పలువురు గౌరవసభ్యులు, ఎంపీపీలు కోరారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది కొరత ఉందని, కొరత తీరగానే 24 గంటలు వైద్య సేవలు అందిస్తామని డీఎంహెచ్వో తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు విజయ్కుమార్, రమేశ్గౌడ్, సుజాత, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల భవనాలకు నిధులు
మెదక్ నియోజకవర్గంలోని 32 నూతన గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని ఎమెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం జడ్పీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. హవేళి ఘనపూర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలకు, మెదక్ మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు, నిజాంపేట మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు, పాపన్నపేట మండలంలోని 2 గ్రామ పంచాయతీలకు, రామాయంపేట మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు, చిన్న శంకరంపేట మండలంలోని 8 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
– ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి