పటాన్చెరు టౌన్, ఆగస్టు 11 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా దవాఖానలో కరెంటు సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో దవాఖాన ఆర్ఎంవో శ్రీనివాస్, వైద్యులు, దవాఖాన అభివృద్ధి సలహా కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం దవాఖానలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు జనరేటర్ కూడా పనిచేయక పోవడంతో రోగులు, వారి సహాయకులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆరా తీశారు. దవాఖానలో విద్యుత్ సమస్య తలెత్తినా.. జనరేటర్ పనిచేయక పోయినా ఈ విషయంలో తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అధికారులను ప్రశ్నించారు.
అత్యవసర వైద్య సేవలు అందించే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడటం, ప్రత్యామ్నాయంగా పని చేయాల్సిన జనరేటర్ పనిచేయకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖాన మొత్తం విద్యుత్ వైరింగ్ మార్చేందుకు సుమారు రూ.4లక్షలు అవసరమవుతాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు ఫోన్ చేసి దవాఖాన వైరింగ్ పనుల కోసం అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. జనరేటర్ను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.
పటాన్చెరు ఏరియా దవాఖాన అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన పనులు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించేందుకు త్వరలోనే దవాఖాన అభివృద్ధి సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని, దవాఖానకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.