ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా గంజాయి( Cannabis ) నిర్మూలనకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) వెల్లడించారు . ఆదిలాబాద్ రూరల్ మండలం పొట్టం లొద్ది గ్రామంలో రూ 38.50 లక్షల విలువ చేసే 385 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై రెండు కేసులు నమోదు చేసినట్లు మీడియ సమావేశంలో వెల్లడించారు.
పొటంలొద్ది గ్రామానికి చెందిన మెస్రం గంగారాం పటేల్ వ్యవసాయ పొలంలో తనిఖీలు నిర్వహించగా 315 గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని వివరించారు. మరో వ్యవసాయ పొలంలో మెస్రం నాగు గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టగా 70 గంజాయి మొక్కలు లభించాయన్నారు.
రెండు ఘటనల్లోనూ నిందితులు సంఘటనా స్థలంలో లభించకపోవడంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ ( NDPS ) చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సై వి. విష్ణువర్ధన్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారని వివరించారు.