సంగారెడ్డి, మార్చి19: పార్టీ ఫిరాయింపులకు గేట్లు తెరవడం మాని, ఎన్నికల హామీల అమలుకు కృషిచేయాలని సీఎం రేవంత్రెడ్డికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చురకలంటించారు. మంగళవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలకు ముందే హామీల అమలుకు కార్యాచరణ సిద్ధ్దం చేయాల్సి ఉండగా, ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకంలో నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాటతప్పిందని ఎద్దేవా చేశారు. అన్నదాతలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో రైతులు లేరని, రైతు భరోసాతో ఎకరానికి రూ.15వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కౌలు రైతులకు రూ.12వేలు ఇస్తామని, ఇంత వరకు ఎలాంటి ప్రక్రియ మొలు పెట్టలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4 వేల పింఛన్, వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి చెయ్యిచ్చారని విమర్శించారు. ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ, ఉద్యోగులకు డీఏ లేదని, నిరుద్యోగలకు భృతి లేదన్నారు. కేఆసీర్ పాలనలో పచ్చని పంట పొలాలు ఉంటే, కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అని సీఎం రేవంత్రెడ్డి అన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
వడగండ్లకు పంటలు నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. రాజకీయాలు మాని రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని హితవు పలికారు. సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుడు గోవర్ధన్ నాయక్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, నాయకులు కాసాల రాంరెడ్డి, కసిని శ్రీకాంత్, కుమార్, దిడ్డి విఠల్, వెంకటేశం తదితరులున్నారు.