మెదక్ : గోదావరి జలాలతో నిండుకున్న హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దూకడం ఓ అద్భుతమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలతో కలిసి మాసాయిపేట మండలంలోని హల్దీ ప్రాజెక్టు వద్ద గంగమ్మకు మంత్రి పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ దశదిశను మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
గోదావరి జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ఈ ప్రాంత రైతులకు ఇప్పుడు అద్భుతంగా పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు.
హల్దీ వాగులోకి నీళ్లు రావడంతో నర్సాపూర్, మెదక్ నియోజక వర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
‘‘గతంలో రైతులు తుకాలు పోయాలంటే మొగులుకు ముఖం పెట్టి చూడాల్సిన వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. రోహిణి కార్తిలోనే తుకాలు పోసుకునే మంచి రోజులు వచ్చాయి.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల పాదాలు కడిగి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నారు.
హల్దీ వాగుకు నీరురావడంతో తేమశాతం పెరిగి ఉమ్మడి మెదక్ జిల్లా ఆయిల్ ఫామ్ తోటలకు అనుకూలంగా మారనుంది.
రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు.
కేంద్రంతో మాట్లాడి ఇక్కడ కూడా సర్వే చేయించి రైతులు ఆయిల్ పామ్ సాగుచేసేలా ప్రయత్నం చేస్తా’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి