సిద్దిపేట, ఆక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిద్దిపేట/సిద్దిపేట అర్బన్/సిద్దిపేట రూరల్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ సిద్దిపేట ప్రజల కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సిద్దిపేట ప్రజల దశాబ్దాల కలలు సాకారం చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఇది ఎన్నికల ప్రచార సభలాగా అనిపించడం లేదని, ఈ సభను చూస్తుంటే మన కలలను సాకారం చేసిన ఈ మట్టిబిడ్డ కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేసే సభలా ఉందన్నారు.
సీఎం కేసీఆర్కు మరింత శక్తినిచ్చి.. దీవెనలిచ్చి.. మరింత ఊపునిచ్చే సభలా ఉందన్నారు. మన సిద్దిపేటకు ట్యాగ్లైన్ ఉండేదన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయడం, గోదారి నీళ్లు రావడం, రైలు సౌకర్యం అనే కోరికలు దశాబ్దాలుగా ఎన్నికల నినాదాలు.. గోడమీద రాతలుగా ఉండేవన్నారు. ఇవాళ వాటన్నింటినీ సాకారం చేసిన మన నాయకుడు కేసీఆర్కు దక్కుతుందన్నారు. కేసీఆర్ను కారణజన్ముడు అంటారన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను కలిసి సిద్దిపేటను జిల్లాను చేయాలని ఎన్నోసార్లు కోరారన్నారు. సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద దరఖాస్తు ఇచ్చిన చేతులతోనే ఈ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి ప్రారంభించడం ఇంత కంటే మన అదృష్టం ఇంకోటి ఉంటుందా అని అన్నారు. అం దుకే ఆయన కారణజన్ముడు అన్నారు. సిద్దిపేటకు రైలు రావాలని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి సిద్దిపేటకు, సిరిసిల్ల, వేములవాడ నుంచి కరీంనగర్ వరకు రైలుమార్గం మంజూరు చేయించారన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైలుమార్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వక, భూసేకరణ చేయక, నిధులు ఇవ్వక ఆ రైలుమార్గం మూలకు పడేశారన్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం, రూ.630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు అందించడంతోనే సిద్దిపేటకు రైలు వచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసి పూర్తిచేశారని, వారి దీవెనగా మీ అందరి ఆశీస్సులతో తాను నీళ్ల మంత్రిగా పనిచేశానని హరీశ్రావు గుర్తుచేశారు. అవమానాలు, ఇబ్బందులను తట్టుకుని సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలను తెచ్చామన్నారు. కరువుతో.. గ్రామాల్లోకి పోతే బిడ్డా కరువు పడ్డది పని దొరుకుతలేదు.. ఏమన్నా మట్టి పని ఉంటే పెట్టవా.. అని అడిగేవారని గుర్తు చేశారు. ఊకిలో కైకిలు దొరుకతలేదని బిడ్డా అని అడిగేవాళ్లన్లి.. ఈ మధ్య గ్రామాల్లోకి పోతే బిడ్డా.. ఇవాళ కేసీఆర్ దయతో గుట్టలు, రాళ్లు కూడా అచ్చు కట్టినం.. గుంటగుంటకు నాట్లు వేసుకున్నం.. ఇవాళ కైకిలోల్లు దొరుకుతలేరని ప్రజలు అంటున్న విషయాన్ని సభలో మంత్రి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మీ అందరి దీవెనలతో సిద్దిపేట ప్రజలకుకు సేవచేసే అదృష్టం దొరికిందన్నారు. మళ్లీ కేసీఆర్ అవకాశం కల్పించారన్నారు. ఇక్కడి ప్రజలు తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే అని మంత్రి పేర్కొన్నారు.
పదేండ్ల కింద ఈ ప్రాంతంలో కరువు పడ్డది కైకిలు దొరుకతలేరనే సిద్దిపేట.. ఈ తెలంగాణ ప్రాంతం ఏ గ్రామానికి పోయినా.. కైకిలోల్లు దొరుకుతలేరన్నంత గొప్పగా తీర్చిదిద్దింది మన కేసీఆర్ కాదా..? సీఎం కేసీఆరే లేకపోతే కాళేశ్వరం అయ్యేదా.. ? ఈ కరువును పారదోలాము.. ఒక్కసారి గుండెమీద చెయ్యి వేసి ఆలోచించాలే అని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ మనం కలలో కూడా అనుకోలే. ఇవాళ ఊర్లల్లో.. ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మగ కూలీలు ఎకరానికి 5 వేలు గుత్తపట్టి నాట్లు వేస్తరని కల గన్నమా.. ? ఒకనాడు గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు.. కరువు కాటకాలతో ఎంతో ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణను ఇయ్యాల పది రాష్ర్టాలకు అన్నం పెట్టే ధాన్యగారంగా మలిచిన ఘనత సీఎం కేసీఆర్ కాదా.. అని అన్నారు. కొంత మంది మూర్ఖులు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు తెలంగాణ వస్తే ఏమొచ్చిందని మాట్లాడుతున్నారు.. ఈ తెలంగాణను దేశంలోనే అతి ఎక్కువ వరిధాన్యం పం డించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దింది నిజం కాదా.. ఈ రోజు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామన్నారు. కండ్ల ముందు నేను చూశా.. ఒక పదేళ్ల కింద కరువు పడితే తెలంగాణ రాకముందు ఇదే మన సిద్దిపేట నియోజకవర్గంలో మనుషులకు తిండిగింజలకు ఇబ్బంది ఉండే.. చివరికి పశువులకు కూడా పశుగ్రాసం పరిస్థితి చూశాం.. ఆ రోజు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చిన్నకోడూరు మండలంలో చింత చెట్ల కింద పశుగ్రాసం కేంద్రం పెట్టి పశువులకు గడ్డి తెచ్చి పశువులను బతికించుకున్నామన్నారు. రాఘవాపూర్ స్టేజీ మీద, నంగునూరు మండలం రాజగోపాల్పేటలో పశుగ్రాస కేంద్రాలు పెట్టి మూగజీవాలను కాపాడుకున్న పరిస్థితి ఆ రోజుది అని అన్నారు. ఇవాళ ఎక్కడ చూసిన పచ్చని పొలాలతో కోనసీమను తలపించేటట్టు తెలంగాణను మన సిద్దిపేటను తీర్చిదిద్దింది నిజం కాదా అన్నారు. మన ట్యాగ్లైన్ సిద్దిపేట జిల్లా, గోదావరి నీళ్లు, రైలు, మెడికల్ కాలేజి ఇచ్చి ఈ ప్రాం తాన్ని ఎంత అద్భుతంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు.
కాంగ్రెసోళ్లు.. ఈ మధ్య ఒక చాన్స్ ఇయ్యండి అని అంటున్నారు.. ఒక్కసారి కాదు బిడ్డా 11సార్లు చాన్స్ ఇచ్చారు ప్రజలు.. కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకానీ పార్టీ మీ కాంగ్రెస్ అని మంత్రి హరీశ్రావు విమర్శించారు. 11సార్లు చాన్స్ ఇచ్చినా మీరు చెయ్యలేని పనిని తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి చూపామన్నారు. నంగునూరు పెద్దవాగు ఎండకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. మందపల్లి మీద కట్టుకున్న 27చెక్డ్యామ్లు ఎండకాలంలో మత్తళ్లు దుంకుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నామన్నారు. రాజగోపాల్ పేట పెద్ద చెరువు నిండితే సగం సిద్దిపేట సల్లగా ఉంటుందని అందరూ అని అన్నారు. 30 ఏండ్లకు ఒక్కసారి నిండని రాజగోపాల్ పేట చెరువు ఇయాళ నిండుకుండలా ఉందన్నారు. ఆనాడు ఈ పెద్ద చెరువు నిండితే మనకు పెద్ద వార్త అని.. ఇయాళ ఆ చెరువు ఎండితే వార్త అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆ చెరువు నిండగా చూడలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చెరువులు ఎండంగ చూడమన్నారు. డిక్షనరీలో సిద్దిపేటలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించిన బిడ్డ సీఎం కేసీఆర్ అని అన్నారు.
‘ఒకనాడు మన ప్రాంతంలో భూముల ధర ఎకరానికి 4 లక్షలు, 5 లక్షలు ఉండే.. అమ్మాయికి పెండ్లి చేయాలన్న, దవాఖానలకు ఖర్చులు పడ్డ.. అడ్డికిపావుషేరకు ఎకరం భూమి అమ్ముకున్నం. సీఎం కేసీఆర్ రైతును బలోపేతం చేస్తే రైతు చేతిలో ఉన్న భూముల విలువ ఇవాళ ఆకాశమంత ఎత్తుకు ధరలు పెరిగినాయి’ అని మంత్రి అన్నారు. ఇవాళ సిద్దిపేటలో ఎక్కడి వెళ్లినా రూ.50 లక్షలు, కోటి ఎకరం పలుకుతుందన్నారు. సీఎం రైతుల గౌరవాన్ని పెంచారన్నారు. కేసీఆర్ గురించి కొంత మందికి తెల్వదు.. కానీ, సిద్దిపేట బిడ్డలకు బాగా తెలుసు.. వారు ఎమ్మెల్యేగా ఉంటే చింతమడకలోని మైసమ్మకుంట్లలో వ్యవసాయం చేశారన్నారు. ఆనాడు కరువు మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు.. ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న వ్యవసాయం చేశారు. ఇవాళ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రోజు కూడా వ్యవసాయం చేసే ఒక రైతు బిడ్డ.. నికార్సయిన రైతుబిడ్డ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రైతు నాయకుడి చేతిలో ఉంది కనుకనే ఇవాళ ఈ రాష్ట్రంలోని రైతులందరూ సంతోషంగా ఉన్నరన్నారు.