మార్చి నుంచి అందించేందుకు పౌరసరఫరాల అధికారుల నిర్ణయం
2, 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు అందించేలా ఏర్పాట్లు
రేషన్ డీలర్లకు ఒక్కోదానిపై రూ.50 కమీషన్
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 25: పౌరసరఫరాల దుకాణాల్లో అందజేసే సరుకుల్లో మినీ సిలిండర్లు కూడా చేరనున్నాయి. రేషన్ దుకాణాల్లో బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులతో పాటు 2, 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే చమురు సంస్థలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. దీంతో నిరుపేదలకు అందుబాటులో సిలిండర్లు లభించడంతో పాటు డీలర్లకు ఒక్కో సిలిండర్పైన రూ.50 చొప్పున కమీషన్ లభించనున్నది. వచ్చే నెల నుంచి రేషన్తో పాటుగా మినీ సిలిండర్లు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బయట మార్కెట్లో మినీ సిలిండర్లు కొందరు అధిక ధరల్లో నింపుతూ వినియోగదారులపై భారం మోపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు మేలు జరుగనున్నది.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు 2, 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లను అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ పేదలు వంట కోసం కట్టెలను ఉపయోగిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని సబ్సిడీపై సిలిండర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిలిండర్ల పంపిణీపై ఆయిల్ కంపెనీ, రేషన్ డీలర్ల రాష్ట్ర నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సిలిండర్ల సరఫరా, పంపిణీపై యాక్షన్ప్లాన్ తయారు చేసి నివేదిక పంపాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 2,16,607 కార్డులు
మెదక్ జిల్లాలో సిలిండర్ల పంపిణీపై రేషన్ డీలర్లు, ఆయిల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్తో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లాలో 521 రేషన్ దుకాణాలు ఉండగా, 2,16,607 కార్డులున్నాయి. ఇందులో 2,02,624 తెల్లరేషన్ కార్డులు, 13,908 అంత్యోదయ కార్డులు, 75 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఇందులో ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో పీవోఎస్ బయోమెట్రిక్, ఐరిష్ విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో సరుకులను పెంచి కమీషన్ సైతం పెంచాలని డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మినీ సిలిండర్లను అందించేందుకు కసరత్తు ప్రారంభించింది.
డీలర్లకు రూ.50 కమీషన్ చెల్లింపు..
ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్లను గృహావసరాలకు వినియోగిస్తుండగా, వ్యాపారులు వాణిజ్య అవసరాల కోసం 19 కేజీల సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. మధ్య తరగతి, ఉన్నత కుటుంబాల వారు ప్రతినెలా సిలిండర్లను వినియోగిస్తున్నప్పటికీ, అత్యంత వెనుకబడ్డ గ్రామీణ కుటుంబాలు ఇప్పటికీ కట్టెల పొయ్యిలనే వాడుతున్నారు. దీంతో పొగతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కట్టెల కొరత ఏర్పడుతున్నది. అడవులు సైతం ధ్వంసమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 2, 5 కిలోల మినీ సిలిండర్లను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ కంపెనీలైన భారత్, ఇండియన్, హెచ్పీ తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రతినెలా గ్యాస్ కంపెనీలు రేషన్ డీలర్ల సిండికేట్ ఆధారంగా 2,5 కేజీల సిలిండర్లను రేషన్ దుకాణాలకు సరఫరా చేయనున్నది. దీంతో సరుకులతో పాటు సబ్సిడీపై అందించనున్న 2, 5 కిలోల గ్యాస్ సిలిండర్లనూ అక్కడే పొందే అవకాశం ఉంది. రేషన్ డీలర్లకు ఒక్కో సిలిండర్పై రూ.50 కమిషన్ చెల్లించనున్నట్లు సమాచారం. తద్వారా రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం రానున్నది. ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.
బ్లాక్ మార్కెట్కు కట్టడి..
బ్లాక్ మార్కెట్లో 2,5 కేజీల సిలిండర్లో గ్యాస్ నింపి ఇస్తే 2 కిలోల సిలిండర్కు రూ.300 వరకు, 5 కిలోల సిలిండర్ రూ.500కు పైగా దోచుకుంటున్నారు. గృహావసరాల సిలిండర్ (14.2 కిలోలు) నుంచి చట్ట విరుద్ధంగా చిన్న సిలిండర్లలోకి చేర్చి అక్రమ మార్గాన అమ్ముతున్నారు. వచ్చే నెల నుంచి మినీ సిలిండర్లు అందుబాటులోకి వస్తే బ్లాక్ మార్కెట్ను అరికట్టవచ్చు.
వచ్చే నెల నుంచే..
జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా మినీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మార్చి నుంచి ప్రారంభిస్తాం. ఇప్పటికే గ్యాస్ సరఫరా చేస్తున్న వివిధ కంపెనీలు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించాం. ప్రభుత్వ విధివిధానాలు చర్చించి ఏ డీలర్కు ఎన్ని సిలిండర్లు అవసరమో వివరాలు సేకరించాం. కంపెనీలు సైతం హామీనివ్వడంతో ఈ ప్రక్రియ మార్చి నెల నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్, డీఎస్వో, మెదక్