గజ్వేల్, జనవరి 5: జర్నలిస్టుల హక్కుల సాధనకు పొరాడుతామని, అక్రిడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర మీడి యా అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు పంక్షన్హాల్లో టీయూడబ్ల్యూజే(హెచ్-143) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల ఆరోగ్యం కోసం రూ.35కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కోటి రూపాయలు ఉన్న బడ్జెట్ను రూ.100కోట్లకు తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది జర్నలిస్టులకు శిక్షణ శిబిరాల ద్వారా వృత్తి నైపుణ్యాలను పెంచినట్లు గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో 450మంది జర్నలిస్టులకు రూ.20వేల చొప్పున వైద్య ఖర్చుల నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేలు ఉన్న అక్రిడిటేషన్ కార్డులను 20వేలకు పెంచామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అల్లం నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ డివిజన్ కార్యావర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నవీన్, ప్రధాన కార్యదర్శిగా మహిపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బలరాం, కోశాధికారిగా రమేశ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మీర్జా అహ్మద్బేగ్లను ఎన్నుకున్నారు.