మెదక్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్లతో కలిసి శాంతిభద్రతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ, మండలాలు, మున్సిపాలిటీల వారీగా మండపాల జాబితా తయారు చేసుకొని ఇన్చార్జిలుగా సిబ్బందికి విధులు కేటాయించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అధికారులు మండపాలు, నిమజ్జన ప్రాంతాలను ముందుగా సందర్శించాలన్నారు. మండపాల నుంచి గణేశ్ నిమజ్జనం చేసే చెరువుల వరకు రోడ్డు గుంతలు లేకుండా చూడాలన్నారు.
విద్యుత్ తీగలు వేలాడకుండా చూడాలన్నారు. విద్యుత్ కనెక్షన్కు అనుమతి తీసుకోవాలని సూచించారు. గగేశ్ నిమజ్జనం సందర్భంగా విద్యుత్, బారీకేడింగ్, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ప్రాం తాల్లో గత ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపల్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 8న నిమజ్జనం, మెదక్ పట్టణంలో 10న నిమజ్జనం ఉన్నందున విద్యుత్ తీగలు వేలాడకుండా చూడాలని, జనరేటర్, మైక్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమా దం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల సహకారంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా అప్రమత్తం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి సూచించారు. మెదక్ పట్టణంలో సెప్టెంబర్ 10న సాయంత్రం నుంచి 11వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆబ్కారీ సూపరిండెంటెండ్కు సూచించారు.
ఎటువంటి సంఘటనలకు తావివ్వకుండా
ముందస్తు చర్యలు తీసుకోవాలి
-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వివరాలు సేకరించి అందుకనుగుణంగా బృందాలు ఏర్పాటు చేసుకొని ఎటువంటి ఘటనలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శుల సహకారంతో గ్రామాల్లో నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని జడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అధికారులు తమ పరిధిలో ఉండి సమన్వయంతో పనిచేయాలని కోరారు. సంఘవిద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టు లు పెట్టి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అటువంటి పోస్టులు తమ దృష్టికి తెస్తే వెంటనే బ్లాక్ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, విద్యుత్ శాఖ ఎస్ఈ జానకీరామ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీపీవో తరుణ్కుమార్, ఆబ్కారీ సూపరింటెండెంట్ రజాక్, అగ్నిమాపక అధికారి అమర్నాథ్గౌడ్, డీటీవో శ్రీనివాస్గౌడ్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.