నంగునూరు, ఏప్రిల్ 7: “తొమ్మిదేండ్లలో పోని కరెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకుపోతున్నది.. కేసీఆరే కావాలి, కరెంట్ రావాలి” అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం నంగునూరు మండల కేంద్రంలోని శ్రేష్ట ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డే తనకు రాజకీయ జీవితం కూడా ఇవ్వాలని కోరారు. ఈ జిల్లాకు కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేశానన్నారు. పార్లమెంట్లో ఒక మాజీ కలెక్టర్గా, మెదక్ ఎంపీగా అడుగుపెట్టే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. కలెక్టర్గా పనిచేసే సమయంలో తన దగ్గరికి వచ్చే వాళ్లను తన తోబుట్టువులుగా చూశానని, ఎంతో బాధ్యతాయుతంగా పనిచేశానన్నారు.
తనకు డబ్బు మీద యావలేదని.. పేదలకు సేవ చేయడం మీదనే దృష్టి ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు. తాను చేసే సేవ నా తర్వాత కూడా 50 ఏండ్లు పేరు నిలిచి ఉండాలన్నదే తన ధ్యేయం అన్నారు. తన ఉమ్మడి కుటుంబ సభ్యుల సహకారంతో రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అండగా ఉంటానన్నారు. యువతకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి జాబ్ మేళా వేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
నంగునూరు మండలంలో తనకు భారీ మెజార్టీ వస్తుందని, ఎంపీగా తాను గెలవడం ఖాయమన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన గులాబీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. నంగునూరు బీఆర్ఎస్ ఇలాఖా అని, సిద్దిపేట నియోజకవర్గంలో నంగునూరు మండలంలో ఎప్పుడూ భారీ మెజార్టీ అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమ, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్గౌడ్, నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, మహిపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, కిష్టారెడ్డి, రాజిరెడ్డి, వేణుగోపాల్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.