మెదక్ : కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ మళ్లీ షురువైంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు. నెల రోజు ల తర్వాత మళ్లీ జిల్లాలో మొదటి డోస్ ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని 24 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడంతో యువతతో పాటు వృద్ధులు సైతం ముందుకొస్తు న్నారు. జిల్లాలోని 24 కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 150 నుంచి 200 మంది చొప్పున టీకా వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు నేరుగా పీహెచ్సీలకు వెళ్లి వ్యాక్సిన్ను తీసుకునే అవకాశం కల్పించారు.
జిల్లాలో 24 కేంద్రాల్లో…
మెదక్ జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఒక ఏరియా ఆస్పత్రి, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొదటి డోస్ వేసుకొని 96 రోజుల నుంచి 114 రోజులు వేచి చూసిన వారికి మాత్రమే రెండో డోస్ను ఇస్తున్నారు. జిల్లాలో 18 ఏండ్లు పైబడిన వారికి టీకాలు వేశారు. ఆదివారం, బుధవారం తప్ప మిగతా రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది.
ఇప్పటి వరకు 2,27,615 మందికి వ్యాక్సిన్..
జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల 27వేల 615 మంది మొదటి, రెండో డోసు తీసుకున్నారు. వీరిలో లక్షా 63వేల 133 మంది మొదటి డోస్ వేసుకోగా, 64 వేల 482 మంది రెండో డోస్ వేసుకున్నారు. 45 ఏళ్ల నుంచి 59 సంవత్సరా ల వరకు మొదటి డోస్ తీసుకున్న వారు 69,958 మంది, 38,420 మంది రెండో డోస్ తీసుకున్నారు. 60 ఏళ్ల పైబడిన వారు 40,177 మొదటి డోస్ తీసుకోగా, 18,513 మంది రెండో డోస్ తీసుకున్నారు.. 18 ఏండ్ల నుంచి 44 సంవత్సరాల వరకు 46,576 మంది మొదటి డోస్ తీసుకున్నారు. 3069 మంది రెండో డోస్ తీసుకున్నారు.
టీకా తప్పకుండా వేసుకోవాలి : డాక్టర్ వెంకటేశ్వర్రావు, డిఎంహెచ్వో
జిల్లాలో 18ఏళ్లు నిండిన వారు తప్పకుండా టీకా వేసుకోవాలి. జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగు తోంది. ఆధార్ కార్డు తీసుకొని కేంద్రానికి వెళ్తే తప్పకుండా టీకా వేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 27వేల మందికి టీకా ఇచ్చాం. కరోనా టీకాపై అపోహాలు పెట్టుకోవద్దు. టీకా తీసుకోవడంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.