జహీరాబాద్, ఆగస్టు 23 : జహీరాబాద్ మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి- 65 ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. ఏటా ఎంతో మంది ప్రయాణికులు ప్రమాదాలకు గురై మృత్యుఒడికి చేరుతున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ శివారులో వెంచర్లు వేస్తున్న నిర్వాహకులు అనుమతులు లేకుండా హైవే నుంచి వెంచర్లకు లింకు రోడ్లు వేసుకోవడం, సర్వీస్ రోడ్డు లేకపోవడంతో బైపాస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు శాపంలా మారింది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారి నిర్మాణంలో లోపాలు, మరమ్మతులు చేయకపోవడం,సిగ్నల్స్ లేకపోవడం యాక్సిడెంట్లు జరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ముంబయి-మచిలీపట్నం 65వ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. ఈ జాతీయ రహదారి జహీరాబాద్ మీదుగా వెళ్తున్నది. జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడం, చౌరస్తాల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆరు నెల ల్లో హైవేపై పది ప్రమాదాలు జరుగగా, నలుగురు చనిపోయారు. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవిం గ్ చేయడం, రహదారి నిర్మాణంలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి సం గారెడ్డి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టినా గ్రామాల వద్ద ఫ్లై ఓవర్లు నిర్మించలేదు. ప్రధాన చౌరస్తాల వద్ద బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర సరిహద్దు మాడ్గి శివారు నుంచి సంగారెడ్డి వరకు 70 కి.మీ. నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తున్నారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించి, గతంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇటీవల తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో బం గుర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఐదుమంది మృతిచెందారు.
అతివేగంతోనే ప్రమాదాలు..
-65వ జాతీయ రహదారిపై ఉన్న మాడ్గి చౌరస్తా, సత్వార్, బుచినెల్లి, బుర్థిపాడు, అల్గోల్, హుగ్గెల్లి, రాయిపల్లి(డి), దిగ్వాల్, చింతల్ఘాట్, కొత్తూర్(డి), లింగంపల్లి, కంకోల్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్, అరూర్, ఎంఆర్ఎఫ్, అత్మకూరు, సదాశివపేట పట్టణంలోని వెళ్లే చౌరస్తా, నందికందితోపాటు పలు చౌరస్తాల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్, కార్లు, ఆటోలు, ట్రాక్టర్ డ్రైవర్లు జంక్షన్ల వద్ద రహదారి దాటడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జహీరాబాద్ సమీపంలోని బైపాస్ రోడ్డులో ఉన్న అల్గోల్ చౌరస్తాను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా వెలుగడం లేదు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది.
-జహీరాబాద్ పట్టణం సమీపంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. కొత్త వెంచర్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. వెంచర్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుం డా జాతీయ రహదారి నుంచి రోడ్లు వేయడంతో ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదర్శనగర్ కాలనీ నుంచి కొత్తగా రోడ్డు వేయడంతో ప్రమాదాలకు నిలయంగా మరింది. కొత్తగా వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మకాలు చేయడంతో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయలేదు. సూచిక బోర్డులు, స్టాపర్లు, బారికేడ్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అల్గోల్ చౌరస్తాలో వాహనాల వేగంతో తరు చూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
నివారణ చర్యలేవీ..?
65వ జాతీయ రహదారిపై ప్రమాదాలను గుర్తించిన అధికారులు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగు లేన్ల రహదారి నిర్మించినా ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రోడ్డు భద్రతను గాలికొదిలేశారు. సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి పర్యవేక్షణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం లేదు. ఈ రోడ్డు పర్యవేక్షణ చేసే కార్యాలయం కర్ణాటకలోని గుల్బర్గాలో ఉంది. దీంతో రోడ్డుపై పర్యవేక్షణ లేకుండా పోయింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు సూచనలు..
జాతీయ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రభుత్వం సంగారెడ్డి ఎస్పీ, రవాణాశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్, ఎక్సైజ్శాఖ, పలు శాఖలకు చెందిన అధికారులతో కమిటీ వేశారు. ఈ కమిటీ సంగారెడ్డి నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు బ్లాక్స్పాట్లు గుర్తించి నివేదికను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపించారు. జాతీయ రహదారి, సర్వీస్ రోడ్టు ప్రారంభం నుంచి ముగిసే వరకు రక్షణగా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. బస్షెల్టర్ల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయాలని కోరింది. మూలమలుపులు, బ్లాక్ స్పాట్లు ఏర్పడేలా హెచ్చరిక బోర్డులు పెట్టాలని తెలిపిన అధికారులు ఇంత వరకు ఏర్పాటు చేయలేదు.
మరమ్మతులు చేపట్టని జాతీయ రహదారి నిర్వాహకులు
చిరాగ్పల్లి నుంచి జాతీయ రహదారిపై పలుచోట్ల రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలతో అధ్వానంగా తయారైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. మరమ్మతులు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పట్టించుకోవడం లేదు.
అల్గోల్ చౌరస్తాలో ప్రమాదాలు..
జాతీయ రహదారిపై పోలీసులు, పెట్రోలింగ్ చేసి లారీలు, ఇతర వాహనాలు నిలుపకుండా చూడాలి. ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా పోలీసులు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. బైపాల్ రోడ్డులో ఉన్న షాపుల వద్ద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపడంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి వాహనాలు నిలుపకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. టోల్ వసూలు చేస్తున్నా అధికారులు రహదారి నిర్వహణను పట్టించుకోవడం లేదు.
బైపాస్లో ప్రమాదాలను నివారించాలి
జహీరాబాద్ పట్టణ సమీపం లో ఉన్న బైపాస్ రోడ్డులో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి అస్తవ్యస్తంగా మారింది. నిత్యం వాహనాలతో రోడ్డు రద్దీగా ఉంటుంది. అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించినా ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. వాహనదారుల నుంచి భారీగా టోల్ వసూలు చేస్తున్న జాతీయ రహదారి అధికారులు నిర్వహణ సక్రమంగా చేయడం లేదు. అల్గోల్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలి.
–ఈశ్వర్రెడ్డి, డ్రైవరు, (భరత్నగర్ )జహీరాబాద్