మెదక్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో జిల్లాలోని అవినీతిపరుల గుండెల్లో దడ పుట్టిస్తున్నది. ఎప్పుడు ఏ శాఖపై ఏసీబీ దాడులు చేస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. మెదక్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదట ఇక్కడ పని చేసిన అదనపు కలెక్టర్ నగేశ్, ఆ తర్వాత డీఎంహెచ్వో కార్యాలయంలో పని చేసిన ఉద్యోగి, తాజాగా చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్పై ఏసీబీ దాడులు జరిగాయి.
ఎంతటివారైనా సరే..
ఉన్నతాధికారులైనా, చిన్న ఉద్యోగులైనా సరే, వారి అక్రమాల గురించి సమాచారం అందితే చాలు ప్రత్యేక కార్యాచరణతో ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగి అవినీతి పరుల అక్రమాలు బయటపెడుతున్నారు. గతంలో కంటే భిన్నంగా దాడులు నిర్వహిస్తూ.. అవినీతి అధికారులతో పాటు డబ్బులు ఇచ్చిన వాళ్లనూ వదలడంలేదు. పక్కా ఆధారాలతో సహా అక్రమార్కులను పట్టుకుంటూ.. ఊచలు లెక్కపెట్టేలా చేస్తున్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ అడుగులు ముందుకేస్తోంది ఏసీబీ. ఏ స్థాయి అధికారులైనా సరే.. దాడులు చేస్తూ అవినీతిని బట్టబయలు చేస్తోంది.
నిర్లక్ష్యం చేస్తే పట్టుబడినట్టే..
గతంలో అవినీతి అధికారుల అమ్యామ్యాల వేధింపులు భరించలేక బాధితులు ఏసీబీని ఆశ్రయించేవారు. వారు వలపన్ని ఆ అధికారిని లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకునేవారు. ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ చట్టాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏసీబీ రూట్ మార్చింది. కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి టోల్ఫ్రీ 1064 నంబర్ను ప్రకటించింది. లంచం తీసుకున్నా ఇచ్చినా అధికారులు అక్రమ ఆస్తులు కలిగివున్నా ఎక్కువ అవినీతి జరిగే శాఖలపై ఫిర్యాదు చేయవచ్చు. కాల్ సెంటర్కు అందిన ఫిర్యాదులను క్రోడీకరించి ఎక్కువగా ఏ శాఖలపై ఏయే ప్రాంతాల్లో ఫిర్యాదులు వస్తున్నాయో గుర్తించి, ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో గత నాలుగైదు ఏండ్లల్లో రెండు, మూడు శాఖలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు ఎకరానికి లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేశాడు.
ఇందులో రూ.40 లక్షలు తీసకున్నాడు. బాధితుడి దగ్గర నుంచి ఐదెకరాల స్థలం రాయించుకున్నాడు. ఈ దాడుల్లో సర్వేయర్ వసీం, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, బినామీ జీవన్గౌడ్ను పక్కా ఆధారాలతో ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా హైదరాబాద్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి రఘునాథ్రెడ్డి చేగుండ మండలంలోని గొల్లపల్లిలో వ్యవసాయ పొలాలు కొనుగోలు చేశాడు. ఆ వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో రెవెన్యూకు సంబంధించి సమస్యలు ఏర్పడ్డాయి. అయితే దీనిని పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ను బాధితుడు గురువారం ఆశ్రయించాడు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రూ.4.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాగా గురువారం రూ.2.70లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గుబులు పుట్టిస్తున్న ఏసీబీ..
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ఏదైనా పనికోసం వినతులు చేసుకుంటే నిర్దేశిత సమయంలో పరిష్కరించాలి. అర్జీదారుడికి అనుకూలమైనా, వ్యతిరేకమైనా తగిన సమాధానం ఇవ్వాలి. అలా చేయకుండా మూలన పెట్టేస్తే దాని గడువు తీరిపోతే ఏసీబీ అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఇది బయటపడితే సంబంధిత అధికారి చిక్కుల్లో పడినట్టే. కచ్చితంగా అతను ఏదో ఆశించే ఆ ఫైల్ను పక్కన పెట్టారని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో జిల్లాలోని ఏసీబీ అధికారులకు మాత్రమే సమాచారం ఇచ్చేవారు. ఇప్పుడు నేరుగా టోల్ఫ్రీ నంబర్ 1064కు తెలియజేయడంతో ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులు నమోదు చేసుకుని అక్కడ నుంచి సంబంధిత జిల్లాల ఏసీబీ అధికారులతో తనిఖీలు చేయిస్తున్నారు.
ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు