సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 10 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఫ్రీడమ్ పార్కును ప్రారంభించారు. కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లతో కలిసి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి ఫ్రీడమ్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 75 వసంతాల వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఈ నెల 11న ఉదయం 6.30 గంటలకు ఫ్రీడమ్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్రీడమ్ రన్లో 500 మంది క్రీడాకారులు, యువత, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొంటారని వివరించారు. అంతకుముందు ఫ్రీడమ్ పార్కులో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
మల్కాపూర్లో మొక్క నాటిన కలెక్టర్
కొండాపూర్, ఆగస్టు10 : సంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, సొసైటీ గోదాం కార్యాలయాల్లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో సంగారెడ్డి కలెక్టర్ శరత్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నదన్నారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజార్షి షా, డీసీవో, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఎంపీడీవో జయలక్ష్మి, సొసైటీ చైర్మన్ పవన్ కుమార్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, డైరెక్టర్ వీరేశం పాల్గొన్నారు.