గజ్వేల్, ఆగస్టు 1: బిడ్డను ప్రసవించిన తల్లి నుంచి మొదటి గంటలో వచ్చే పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం గజ్వేల్ మహతి ఆడిటోరియంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను మంత్రి హరీశ్రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు తల్లులు, ఆశవర్కర్లు, అంగన్వాడీలు, వైద్యసిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. తల్లిపాలు దేవుడిచ్చిన వరమని, తల్లిపాల ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరినీ అభినందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. దేశంలో మొదటి గంటలో తల్లి నుంచి వచ్చే పాలను తాగుతున్న చిన్నారులు కేవలం 41శాతమే ఉండగా, బంగ్లాదేశ్లో 91శాతం చిన్నారులు తల్లిపాలు తాగుతున్నట్లు నివేదికలు ఉన్నాయన్నారు. ఎక్కువగా తల్లిపాలు తాగే దేశాన్ని గ్రీన్ నేషన్ అంటారని, తక్కువగా తాగే దేశాన్ని రెడ్ నేషన్గా గుర్తిస్తారన్నారు.
దేశాన్ని గ్రీన్ నేషన్గా గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గజ్వేల్ దవాఖానలో ప్రతినెలా 400 వరకు డెలివరీలు అవుతున్నాయని, వాటిలో చాలావరకు సాధారణ ప్రసవాలేనన్నారు. తల్లిపాలు తాగడంతో పిల్లలకు రోగనిరోధకశక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారన్నారు. వ్యాధుల నివారణకు వేసే మొదటీ టీకాతో సమానంగా తల్లిపాలు పని చేస్తాయన్నారు. గర్భిణులు దవాఖానకు వచ్చే మొదటి పరీక్షల సమయం నుంచి తల్లిపాల ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంగన్వాడీలు, ఆశవర్కర్లు, వైద్యులు వారికి వివరించాలని మంత్రి సూచించారు. తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారన్నారు. తల్లిపాలు ఇవ్వడంతో చా లా ప్రయోజనాలున్నా కేవలం మూఢవిశ్వాసంతో చాలామంది ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ దవాఖానలు బలోపేతం అవుతున్నాయని, తల్లిపాల ప్రాముఖ్యత, సాధారణ ప్రసవాల గురించి వైద్యసిబ్బందితో పాటు స్త్రీశిశుసంక్షేమ శాఖ సిబ్బంది, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సెక్షన్ ఆపరేషన్లను తగ్గించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నామని, వైద్యులు, ఆశ కార్యకర్తల సహకారంతో ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లి పాల బ్యాంకులు
తల్లిపాల ఆవశ్యకతను గుర్తించిన తె లంగాణ ప్రభుత్వం, ఇప్పటికే మూడు త ల్లి పాల బ్యాంకులను ఏర్పాటు చేసిందని మంత్రి వెల్లడించారు. ప్రసవాల సమయంలో ఎక్కువ ఆపరేషన్లు కావడంతో లేదా తల్లి బలహీనంగా ఉండడం వల్లో, తల్లులు మృతి చెందడం వల్లో చిన్నారు లు తల్లిపాలకు నోచడం లేదన్నారు. అ లాంటి చిన్నారులకు తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నదన్నారు. హైద్రాబాద్లోని నిలోఫర్లో, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బ్యాంకులు ఏర్పాటు చేశారన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తల్లిపాల బ్యాంకులను ప్రారంభిస్తామన్నారు. ఈ తల్లిపాల బ్యాంకుల్లో తల్లిపాలను భద్రపరిచి, తల్లిపాలు అందని చిన్నారులకు అందిస్తామన్నారు. దీంతో శిశుమరణాలు తగ్గడంతో పాటు పిల్లలు ఆరోగ్యవంతంగా మారుతారన్నారు.
ప్రత్యేక గది ఏర్పాట్లు చేయాలి
ప్రస్తుతం సమాజంలో తల్లిపాలు ఇవ్వడానికి వెనుకాడి, డబ్బాపాలను చిన్నారులకు పట్టిస్తున్నారని మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డకు పాలివ్వడానికి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయాలన్నారు. సిద్దిపేట బస్టాండ్లో తాము తల్లిబిడ్డకు పాలివ్వడానికి ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బిడ్డకు పాలివ్వడానికి తల్లి సంకోచిస్తే, ఆ బిడ్డకు జీవితాంతం ఇక తల్లిపాలు లభించే అవకాశం ఉండదని గుర్తించాలన్నారు. బిడ్డకు పాలివ్వడానికి అవసరమైన చోట్ల స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సమాజానికి పిలుపునిచ్చారు.
500మంది తల్లులతో ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
స్థానిక తల్లిపాల సొసైటీ, రోటరీ క్లబ్, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500మంది తల్లులు పాల్గొనగా, ఇండియా బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని రికార్డుగా నమోదు చేసింది. దేశంలో గతంలో 50మంది తల్లులు ఒకే వేదికపై పాల్గొన్న రికార్డు ఉండగా, గజ్వేల్లో 500మంది పాల్గొన్న రికార్డుగా నమోదు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు రికార్డు నమోదు చేసిన పత్రాన్ని మంత్రి హరీశ్రావు చేతులమీదుగా తల్లిపాల సొసైటీ వారికి అందజేశారు. కార్యక్రమానికి మూలకారకుడైన డాక్టర్ వాసవచారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, డాక్టర్ యాదవరెడ్డి, టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక కౌన్సిలర్లు లక్ష్మీకిషన్రెడ్డి, శీర్ల శ్యామల మల్లేశం, బబ్బూరి రజిత పాల్గొన్నారు.