శివ్వంపేట, జూలై7: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో పెద్దచెరువు కట్టవద్ద గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై రవికాంత్రావు కథనం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఓ మహిళను హత్య చేశారనే విషయం మండలంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. మండలంలోని తాళ్లపల్లితండాకు చెందిన ధనావత్ బూలి (50) శివ్వంపేటలోని ఓ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండేది.
రోజు మాదిరిగానే బుధవారం పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి బయలుదేరింది. గురువారం ఉదయం శివ్వంపేట పెద్దచెరువు కట్ట సమీపంలో శ్మశానవాటిక పక్కన మృతి చెంది పడి ఉంది. అటుగా వెళ్లిన స్థానికులు చూసి విషయాన్ని తండావాసులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రవికాంత్రావు తన సిబ్బందితో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బూలిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడంతో డాగ్స్క్వాడ్, క్లూస్టీం సిబ్బంది వచ్చి పలు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై బూలి కుమారుడు ధనావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.