సంగారెడ్డి అర్బన్, జూన్ 25 : సంగారెడ్డి మండల పరిధిలోని ఎంఎన్ఆర్ యాజమాన్య వ్యతిరేక విధానాలపై శనివారం విద్యార్థులు నిరసన చేపట్టారు. అడ్మిస్ట్రేషన్ భవన్ ఎదుట ధర్నా చేసి ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఎన్ఆర్ నిర్ణయాలు విద్యార్థుల ఆందోళనకు దారి తీస్తున్నాయి.ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంఎన్ఆర్లో మెడికల్ కళాశాల సీట్లను తగ్గించడం చర్చనీయంశంగా మారింది. సరైన బోధన, సిబ్బంది నియామకం, ల్యాబ్లో సరైన పరికరాలు, సదుపాయాలు లేకపోవడంపై 150 మంది వైద్య విద్యార్థులు నిరసన చేపట్టారు. ఎంబీబీఎస్ సీటుకు లక్షల్లో ఫీజులు తీసుకుంటూ అరకొర సౌకర్యాలు కల్పించడంపై విమర్శించారు. మంచి భోజనం కూడా పెట్టడం లేదని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఫైన్ల రూపంలో చేసే దోపిడీని అరికట్టి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం ..: డైరెక్టర్ రవివర్మ
వైద్య విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ఆందోళన విరమించి క్లాస్ రూంల్లోకి వెళ్లాలని ఎంఎన్ఆర్ డెరెక్టర్ రవివర్మ వైద్య విద్యార్థులను కోరారు. చర్చలు జరిపి పరిష్కారం చూపుతామన్నారు. వైద్య విద్యార్థులుగా ఇలాంటి ఆందోళనలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులను చర్చలకు పిలవడంతో ఆందోళన విరమించారు.